|
|
Articles: Festivals | గణేశ్ మహరాజ్ కీ జై - Site Administrator
| |
ఒకనాడు సత్తాజిత్తు తమ్ముడు ప్రసేనుడూ ఆ మణిని కంఠానికి ధరించుకొని వేట కోసం అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసంముక్క అని భ్రమించి, ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని తీసుకుపోతుండగా, ఒక భల్లూకం ఆ సింగాన్ని హతమార్చి మణిని తీసుకొని తమ కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చింది. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముని మరణ వార్త విని 'మణి ఇవ్వలేదని కృష్ణుడే నా సోదరుని చంపి, రత్నాన్ని అపహరించాడనిని నగరంలో చాటించాడు. శ్రీకృష్ణుడు అది విని పాలలో చంద్రబింబాన్ని చూసిన దోష ఫలం అని భావించాడు. ఈ అపవాదను తొలగించుకునేందుకు బంధువులతో కలిసి అరణ్యానికి వెళ్ళి వెదికాడు. ఒకచోట ప్రసేన కళేబరం, సింగం కాలి జాడలు పిదప భల్లూకం కాలి గుర్తులు కనిపించాయి.
ఆ దారిన వెళుతుండగా ఒక పర్వతగుహ ద్వారం చూసి, పరివారాన్ని అక్కడ విడిచి కృష్ణుడు గుహ లోపలికి వెళ్ళి అక్కడ బాలిక ఉయ్యాలపై కట్టి ఉన్న మణిని చూసి అక్కడికి వెళ్ళి, ఆ మణి చేతితో తీసుకొని వస్తుండగా, ఉయ్యాలలోని బాలిక ఏడ్వడం ప్రారంభించింది. దీనితో దాది చూసి వింత మనిషి వచ్చాడనుకొని కేకలు వేసింది.
జాంబవంతుడు ఆగ్రహోదగ్రుడై వచ్చి శ్రీకృష్ణునిపై బడి అరుస్తూ, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ, ఘోరంగా యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు వానిని పడతోసి, వృక్షాలతో రాళ్లతో, చివరికి ముష్టిఘాతాలతో రాత్రింబవళ్లు ఎడతెగక ఇరువై ఎనిమిది రోజులు యుద్ధం చేశారు. జాంబవంతుడు బలం క్షీణించి శరీరం మొత్తం బాధలు వచ్చి భయంతో తన బలాన్ని హరించిన పురుషుడు రావణ సంహారి శ్రీరామచంద్రుడే అని తలచి, అంజలి ఘటించి, 'దేవాది దేవా! ఆర్త జన పోషా! భక్తజన రక్షా! నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాను. ఆ కాలంలో నా మీద వాత్సల్యం చేత నన్ను వరం కోరుకోమనగా నా బుద్ధిమాంద్యంతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. తరువాత అది జరుగుతుందని చెప్పారు.
ఇప్పుడు నా కోరిక నెరవేర్చారు. నా శరీరమంతా శిథిలమైంది. ప్రాణాలు కడబట్టాయి. జీవితం మీద కోరిక నశించింది. నా అపరాధాలు క్షమించి కాపాడుమని ప్రార్ధించాడు. శ్రీకృష్ణుడు దయాళుడై, జాంబవంతుని శరీరమంతా తన చేతితో నిమిరి భయం తొలగించి, 'భల్లూకేశ్వరా! శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపుకొనేందుకు ఇలా వచ్చానని, మణిని ఇవ్వు. నేను వెళతానన్నాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తమ కుమార్తె జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. తన ఆలస్యానికి పరితపిస్తూ బంధు మిత్ర సైన్యాలకు ఆనందం కలిగించి, కన్యారత్నంతో, మణితో శ్రీకృష్ణుడు పురం చేరి సత్రాజిత్తును పిలిపించి, పిన్న పెద్దలందరికకీ విషయం అంతా చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకు అందజేశాడు. 'అయ్యో! లేనిపోని నింద మోపి తప్పు చేశానని' మణి సహితంగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమించమని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను తీసుకొని మణి వద్దని మరలా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభ ముహూర్తంలో జాంబవతీ సత్యభామలను పెళ్ళి చేసుకొన్నాడు. అక్కడికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి, 'మీరు సమర్ధులు గనుక నీలాపనింద బాపుకున్నారు. మాకేమి గతి' అని ప్రార్ధించారు. శ్రీకృష్ణుడు దయాళుడై, 'భాద్రపద శుద్ధ చతుర్ధిని పొరపాటున చంద్రు దర్శిస్తే ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి, ఈ శమంతక మణి కథను విని అక్షింతలు శిరస్సుపై చల్లుకొంటే నీలాపనింద పొందరని తెలిపాడు. దేవాదులు సంతోసించి తమ నివాసాలకు వెళ్ళారు. ఇలా సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్షం విషయాలను శౌనకాది మునులకు వినిపించి వారిని వీడ్కొని సొంత ఆశ్రమానికి వెళ్ళాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|