అయితే ముఖ్యమంత్రి సహాయనిధి అనేది అక్షయపాత్ర కాదు. ప్రజలు, దాతలు, ఉదారులు విరాళంగా డబ్బు ఇస్తేనే అందులో జమ అవుతాయి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తనను అభినందించడానికి బొకేలు, బహుమతులు తేవద్దని, తృణమో పణమో ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తే అసంఖ్యాక ప్రజలకు ఉపకరిస్తుందని ప్రకటించడంతో చాలా మంది ఆయన మాటను గౌరవించి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉడుతాభక్తిగా ఎంతో కొంత విరాళం ఇచ్చారు. ఆ విధంగా ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు కొంత పెరిగి ఉండవచ్చు. కూర రాజన్న లాంటి వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఆ నిధులను ఖర్చు చేయవచ్చు.
అయితే, గద్దర్ ఆ ప్రకటన చేయకముందు గాని, చేశాక గాని ముఖ్యమంత్రి సహాయనిధికి ఏమైనా విరాళం అందజేశారా? అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తున్నది.
ముఖ్యమంత్రి పరమ శత్రువు - ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేయాలని సంకల్పించాక ఆయన పేరుతో గల సహాయనిధికి విరాళమెందుకివ్వాలి?... అవును ఎందుకివ్వాలి?... ఇవ్వకూడదు. ఆయనను.... ఆయన ప్రభుత్వాన్ని కూల్చేయాలి.
అలా కూల్చేయదగ్గ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నడిపే సారథి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రం నక్సలైట్ నాయకుడు కూర రాజన్న వైద్య ఖల్చులు పూర్తిగా భరించాలి. ఈ డిమాండ్ చేయడం సబబేనా?... ఎందుకు కాదు నూటికి నూరుపాళ్ళు సబబే... కూర రాజన్న ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాబట్టి ఆయనను ఆదుకోవలసిన బాధ్యత అందరితో పాటు ప్రభుత్వానికి ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమంటే ప్రజలే... వై.ఎస్., డిఎస్ లు కాదు. అశేష ప్రజలు. ఆ ప్రజల్లో ఒకడైన గద్దర్ పై కూడా ఆ బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి సహాయనిధికి గద్దర్ విరాళం ఇవ్వకున్నా ఆసుపత్రికే తన విరాళం అందించవచ్చు. అలా అందించి ప్రజలు నక్సలైట్ నాయకుడు కూర రాజన్నను కాపాడుకోవాలి. బతికించుకోవాలి అని అదే మీడియాతో చెప్పి ఉంటే ఎలాంటి జాప్యం (రెడిటేపిజం) లేకుండా ఎన్నో నిధులు పోగయ్యేవి. మరింత మెరుగైన వైద్యం ఆయనకు అందేది.
|