నిజానికి ప్రపంచంలో మనకున్న వనరులు అత్యాశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఈ వనరుల్ని సక్రమంగా వినియోగించుకోలేక మనం అనేక రంగాలలో వైఫల్యం చెందుతున్నాం. మనకు తెలిసో తెలియకో పర్యావరణానికి హాని కలిగిస్తూ మనకు మనమే హాని కలిగించుకుంటున్నాం.
మనదేశంలో, ముఖ్యంగా మనరాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు స్పష్టంగా ఉన్నాయి. పంటల దిగుబడిలో అత్యధిక ఫలితాలు పొందామనే అబద్ధాల ప్రచారం మన దేశాన్ని అధోగతి పాల్జేసింది. రసాయన ఎరువుల వల్ల, కీటక నాశకాల వల్ల, అధిక దిగుబడి కోసం అత్యాశలకు పోవడం వల్ల భారతీయ రైతుల జీవితం దుర్భరమయింది.
బహుళ జాతీయ సంస్థలు పుష్టిగా ఇచ్చే జీతాలకు అమ్ముడుపోకుండా భారతీయులకు ఏం కావాలో తెలుసుకొని దాని కోసం పాటు పడుతున్నందుకు డాక్టర్ ఖాదర్ ను మనం అభినందించాలి.
ప్రకృతి వైద్యం లాగే ప్రకృతి వ్యవసాయం కూడా భారతీయుల తరతరాల సంపద. దానివైపు దృష్టి మళ్ళించడమే మన తక్షణ కర్తవ్యం. ఆరోగ్యపరమైన నేల, ఆరోగ్యకరమైన జంతుజాలం కలిస్తే ఆరోగ్యకరమైన ప్రజా సమూహం వర్ధిల్లుతుందనే విషయాన్ని డాక్టర్ ఖాదర్ ప్రచారం చేస్తున్నారు.
భారతీయులకు సాంప్రదాయకమైన వ్యవసాయ పద్ధతులున్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి సహజమైన వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించడం ద్వారా భారతీయులు ఆరోగ్యకరమైన పంటలు పండించి ఆరోగ్యాన్ని కాపాడడానికి కావలసిన విధంగా ఆహార పద్ధతుల్ని మలచుకున్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఒకే రకమైన పంటను కొన్ని వందల ఎకరాల్లో పండిస్తారు. ఒకే రకమైన ఆహారాన్ని తినడం ద్వారా ఎన్ని నష్టాలను వారు అనుభవిస్తున్నారో వాటినే మన మీద కూడా బలవంతంగా రుద్దుతున్నారు. అందువల్లే కేవలం బియ్యమో, గోధుమలో పండించి దాన్నే ఆహారంగా భావించే స్థితి మనకు కలిగింది. పంటను విపరీతంగా పండించడానికి అనేక కృత్రిమ విధానాలను అనుసరించి ధరలు పడిపోతే కొన్ని వేల టన్నుల్ని సముద్రం పాలు చేసే చెత్త విధానాలు పాశ్చాత్య దేశాలలో అమలులో ఉన్నాయి. ఏ పంటల్ని ఎప్పుడు పండించాలి, ఎలా పండించాలి, ఎంత పండించాలి లాంటి ప్రశ్నలకు ఆధునిక శాస్త్రజ్ఞులు చూపిన సమాధానాల వల్ల భారతీయ రైతులు ఆత్మహత్యలు చేసుకొనే స్థితికి వచ్చారు. వీటిని గురించి సరైన అవగాహన కల్గించడం తమ ప్రథమ కర్తవ్యంగా భావించారు డాక్టర్ ఖాదర్. వారానికొకసారి పల్లెటూళ్ళకు వెళ్ళి సహజ పద్ధతుల్లో వ్యవసాయం ఇచ్చే ఫలితాల గురించి, సరైన ఆహార పద్ధతుల గురించి చెప్పడం ఆయన వృత్తి ధర్మంగా మారింది.
|