జనవరి 5న లెనిన్ లేచి నిలబడి కాలర్ సవరించుంకుటున్న రేడియో టెలి ఫోటోగ్రాఫ్ ను శ్రీహరికోట సైంటిస్టులు విడుదల చేశారు. అన్ని దేశాల వారూ లెనిన్ కు స్వాగత సత్కారాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే ఆఫ్రికా దేశాల వారు అమెరికాలో స్వాగతం ఇవ్వడం అంగీకరించలేదు. అందుకని `అంగోలాలో స్వాగతం!' అని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.
అయితే రోదసీ పరిశోధనారంగంలో పచార్లు చేస్తున్న లెనిన్ కు మాట్లాడే శక్తి ఇంకా రాలేదు. అదీగాక భూమి మీదకు వస్తే జీవిచడం కష్టమని శాస్త్రజ్ఞులు భావించారు. ఈ సందర్భంలో శ్రీశ్రీ రాసిన సునిశతమైన వ్యంగ్యంతో కూడిన చురకలు చూడండి:
ఇది ఒక్క అంగోలా ప్రజలకే కాక యావత్ర్పపంచ ప్రజలకే ఆశాభంగం కలిగించేది.
`ఒక్క దైవభక్తులు మాత్రం చచ్చినవాళ్ళు మళ్ళీ బతకడానికి వీలులేని విధంగా భూలోకంలో నానా విధాల కల్మషాన్ని సృష్టించిన భగవంతుని చాచక్యానికి పరమాహ్లాద భరితులయ్యారు.'
చివరకు లెనిన్ శవాన్ని ద్రావకాలలో పదిలపరచడానికి మరల వెనక్కి తెస్తారు. జనవరి 8 నుంచి లెనిన్ సమాధిని దర్శించుకోవచ్చని టాస్ ప్రకటించింది.
ఇదీ అద్భుతరసం.
ఇక రౌద్రరసానికి సంబంధించిన రచన శీర్షిక `నింపాదిగా కోపం చెయ్యి.' `ఉన్న కోపమంతా ఒక్కసారి ఒలకబోసేస్తే తలంటిస్నానం చేసినంత హాయిగా ఉంటుంది కొంతమందికి. నేను మాత్రం వాళ్ళ కోవకి చెందినవాణ్ణి కాను' అంటూ ప్రారంభించి `కోపం అనేది మహా చెడ్డ దుర్గుణం' అంటారు. మరి మంచి దుర్గుణం అంటూ ఉంటుందా అంటే - ఉంటుంది. కోపం చెయ్యడం చెడ్డ దుర్గుణం, నింపాదిగా కోపం చెయ్యడం మంచి దుర్గుణం - అంటారు.