ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో దానికీ పర్యావరణానికి ఉండే సంబంధం ఏమిటో తెలియజెప్పటం డాక్టర్ ఖాదర్ ప్రచారంలో ముఖ్యభాగం. సహజ పద్ధతుల్ని అనుసరించి వ్యవసాయం చేయడం ద్వారా ఖర్చులు తగ్గడమే కాకుండా సారవంతమైన నేలను కాపాడడం కూడా అందులో భాగమే అవుతుంది. ఒక్కసారిగా ఫలితాలు అథ:పాతాళానికి వెళ్ళేసరికి మన అన్నదాతలకు ఆత్మహత్యలే గతి అవుతున్నాయి. దీన్ని తప్పించి మైసూరు చుట్టుపట్ల కనీసం వెయ్యి ఎకరాల భూమినైనా సహజ వ్యవసాయ భూమిగా మార్చాలన్నది డాక్టర్ ఖాదర్ ఆశయం. ఇప్పటికి దాదాపు 150 పల్లెలకు వెళ్ళి ఈ విషయాల గురించి నచ్చజెప్పారాయన. వీటితో బాటు కొన్ని ఎకరాలు కొని అందులో సహజ పద్ధతులతో ఆహారానికి ఆరోగ్యానికి పనికివచ్చే ఒక అడవినే పెంచుతున్నారాయన.
ఇలాంటి ప్రయోజనకరమైన పనులతో పాటు హోమియోపతి వైద్య విధానంలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు డాక్టర్ ఖాదర్ ఆయన డాక్టరేట్ పొందింది జీవ రసాయన శాస్త్రంలో. ఆ పరిశోధనలో మునిగి ఉన్నప్పుడు హోమియోపతి ఎలా పనిచేస్తుందనే విషయం మీద కూడా ఆయనకి ఆసక్తి కలిగింది. ఒక శాస్త్రవేత్తగా ఆయనకు హోమియోపతి గురించి సహజంగానే ఎన్నో అనుమానాలుండేవి. బి.కె.ఎస్.అయ్యంగార్ యోగసాధనకి తమని తామే ప్రయోగశాలగా చేసుకున్నట్లే డాక్టర్ ఖాదర్ కూడా తమమీదే ఇరవైసార్లు ప్రయోగాలు జరుపుకున్నారు. ఇలా నిరంతర పరిశోధనల ద్వారా డాక్టర్ ఖాదర్ ప్రసిద్ధ హోమియోపతి నిపుణులుగా తయారయ్యారు. ప్రస్తుతం ఆయన ఇల్లు వైద్య సంబంధమైన సలహాలు పొందేవారితో ఎప్పుడూ నిండుగా ఉంటుంది. హోమియోపతి గురించి అత్యాధునిక పరిజ్ఞానం కూడా సంపాందించిన డాక్టర్ ఖాదర్ డాక్టరే అయిపోయారు.
ఆరోగ్యమే మహాభాగ్యమనే సామెత నిజం కావాలంటే సరైన ఆహార పద్ధతులు అవలంబించాలని, ఆ ఆహారం లభించాలంటే పర్యావరణమే ప్రాణమనే విషయాన్ని గ్రహించాలని ప్రజలకి నచ్చచెప్తున్న డాక్టర్ ఖాదర్ దూదేకుల అభినందనార్హులు.