ఉదాహరణకు మత్స్యపరిశ్రమనే తీసుకుంటే... వరదలు, తుఫానులలో ఆస్తినష్టం, ప్రాణనష్టం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకృతి ఉపద్రవాల గురించి వాతావరణ శాఖ, కేంద్ర జలసంఘం, నీటిపారుదల శాఖ ముందుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తీరప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించి, ఆయా జోన్లలో చేయదగిన, చేయకూడని పనులకు నిబంధనలను ఏర్పరిచారు. మత్స్యకారుల పల్లెలు రెండవజోనులో ఉంటాయి. మత్స్యకారులు మాత్రమే సముద్రతీరంలో ఎనిమిది కిలోమీటర్ల దాకా తమ పడవలతో చేపలు పట్టుకోవచ్చు. మరపడవలు ఎనిమిది కిలోమీటర్ల తరువాత మాత్రమే చేపలను పట్టుకోవాలి. ఎనిమిది కిలోమీటర్ల లోపల, ఆ రోజున చేపలు ఎక్కడ బాగా దొరుకుతాయో, ఉపగ్రహం ద్వారా గమనించి మత్స్యకారులకు సమాచారం అందించే ఏర్పాటు ఉన్నది. మత్స్యసంపదకు, పక్షిసంపదకు అవినాభావ సంబంధం ఉంది. కొల్లేరు వంటి పెద్ద సరస్సులే గాక, చిన్న చిన్న సరస్సులు వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మత్స్యకారులతో పనిచేసే శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు తమ రంగాలు తప్ప మిగిలిన విభాగాల గురించి అవగాహన అంతగా ఉండకపోవచ్చు. కానీ ఈ అన్ని విషయాల గురించి మత్స్యకారుడికి అనాదిగా తెలుసు.
ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, మత్స్యకారులు కలిసి పనిచేయడంలో సంప్రదాయ ఆధునిక విజ్ఞానాల మార్పిడి ఏ మేరకు జరుగుతుంది? కేవలం సమాచారం తెలుగుచేసి ఇస్తే సరిపోతుందా? అధికారుల ఉపయోగం కోసం మత్స్యకారుల వాడుక పదజాలం మీద ఏదన్నా పదకోశం ఆ శాఖ తయారుచేసిందా? తూర్పుతీరంలో సునామీ తరువాత మత్స్యకారుల స్థితిగతుల గురించి అధ్యయనం చెన్నైలోని `యాక్షన్ ఎయిడ్' అనే సంస్థ మాకు అప్పగించినప్పుడు ఎదురైన ప్రశ్నలివి. మత్స్యకారుల పదసంపద గురించి ఉద్యోగులకు ఎంత తెలీదో, ఉద్యోగుల పరిభాష గురించి బెస్తవారికి కూడా అవగాహనే లేదు అనే విషయం బోధపడింది.
ఇలా ప్రతిరంగంలో సాంప్రదాయక విజ్ఞానంతో మనుగడ సాగించే పనివాడికి మార్పు కోసం, అధికోత్పత్తి కోసం, వనరుల, పనివాళ్ళ సంక్షేమం కోసం పనిచేసే ఉద్యోగిని, భాష ద్వారా చేరువ చేస్తే, కొంతవరకైనా పనివారి పరిస్థితి మెరుగుపడుతుంది.
|