ప్రజల మనిషినని చెప్పుకుంటూ ఇన్ని రక్షణ వలయాలతో, పిస్తోలుతో, కర్రతో, కత్తితో సంచరించడం, గన్ మన్ కనుసన్నల్లో కనిపించడం ఊహకందని విచిత్రం.
అలాంటి వ్యక్తి రూపాయి విదల్చకుండా లక్షల రూపాయలు ప్రభుత్వం తాను చెప్పగానే విదల్చాలని డిమాండ్ చేయడం ఒక పౌరుడిగా ఇదెంత వరకు న్యాయం - ధర్మం?... ప్రతి పౌరుడికి హక్కులే కాదు, బాధ్యతలూ ఉంటాయి. బాధ్యతలు నిర్వహిస్తూనే హక్కుల కోసం పోరాడటం సమంజసం. అంతేగాని బాధ్యత ఊసే ఎత్తకుండా హక్కుల పోరాటం చేస్తానంటే అదే విధంగానైనా ఆమోదయోగ్యంగా ఉంటుందా?
గద్దర్ మనవరాలి వయసంత వయసు గల గోదావరి ఖనికి చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ లో చదువుకుంటున్న మధుప్రియ చూపిన ఆదర్శం ముందు ప్రజాగాయకులమని భావించే కుహనా ప్రజాగాయకులు సిగ్గుతో తలదించుకోవాలి.
ఏడవ తరగతి చదువుతున్న మధుప్రియ ఇప్పటికే తన పాటల ద్వారా రాష్ట్రాన్ని ఉర్రూతలూగించింది. అలాంటి మధుప్రియకు ఒక సంగీత దర్శకుడు మెచ్చుకోలుగా ఇచ్చిన వెయ్యి రూపాయలను రెండు కిడ్నీలు పాడైన నలుగురు ఆడపిల్లలు గల కుటుంబానికి అందజేసింది. అనంతరం తన పాటల కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కుటుంబ దీన గాథ వినిపించి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసి ఇచ్చింది. ఇంత చిన్నవయసులో ఇలాంటివి ఇంకా ఎన్నో కార్యాలు చేసింది. ఈ విషయాలు తెలిశాక చేతులెత్తి ఎవరికి నమస్కరించాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.
|