ఆ కొడుక్కి మాయదారి జ్వరం వచ్చింది. ఎంతో వైద్యం చేయించాడు. తనవీ, కొడుకువీ తలనీలాలిస్తానని ఏడుకొండల వాడికి మొక్కుకున్నాడు. రెండు రోజుల పాటు జ్వరం తగ్గుముఖం పట్టింది. శెట్టి దేవుడు దేవుడే అని పొంగిపోయాడు. కాని కర్మఫలం వల్ల మూడోరోజు శెట్టి కొడుకు మరణించాడు!
శెట్టిని ఓదార్చటానికి రచయిత వెళ్ళాడు. మొక్కుకున్నా లాభం లేకపోయిందనీ, పూర్వజన్మలో చేసిన పాపఫలితమన్నాడు. తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవలసిన అవసరం తప్పిపోయినందుకు సంతోషించమని రచయిత సలహా ఇచ్చాడు.
ఈ సలహా విని రామయ్య శెెట్టి గజగజ వణికిపోయాడు. తలనీలాలు ఇవ్వాల్సిందేనని ఇచ్చాడు. ఇవ్వకపోతే తన ప్రాణానికే ముప్పని భయపడ్డాడు. ఇదీ భయానక రసం.
ఇక శృంగార రసం. ఈ కథ పేరు `మదనకదన కథ'. అరవయ్యేళ్ళ జమీందారిణి అమ్మారావు గారికీ, యాభై యేళ్ళ డాక్టర్ మదనమోహన్ కీ మధ్య యాదృచ్చికంగా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ వైద్యుడు తన పరిశోధనల ఫలితంగా వయసు తగ్గించే మందు కనుక్కుంటాడు. ఫలితంగా తను ఇరవైయ్యేళ్ళవాడుగా, అమ్మారావు గారు ముప్పయ్యేళ్ళ యువతిగా మారారు. ఇద్దరూ శృంగార జీవితం ప్రారంభించారు. డాక్టరు తను కనిపెట్టిన మందు ఫార్ములా నాశనం చేసేసి, అమ్మారావు గారితో బయలుదేరి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉంటారు. భగదంత బాబాగా ప్రసిద్ధి చెందుతాడు. `ప్రేమ కోసం సైన్సులాంటి క్షుద్ర వ్యాసంగాలను వదలిన త్యాగమూర్తి' అని ఆయన్ను భక్తులు పొగుడుతుంటారు.
బీభత్స రసానికి చెందిన కథ వచన గేయ ప్రక్రియకు దగ్గరగా ఉంది. దీని శీర్షిక `కుళ్ళూ, పీతుళ్ళూ!'. `ఈ దేశంలో ఎలకా దేవుడు, పందీ దేవుడు, మనిషే యెదవ' అంటాడు. ఈ మధ్య పంది, కుక్క ప్రదక్షిణాలు చేస్తున్నాయని వాటిని మ్రొక్కే మూఢులున్నారు. 1977లోనే శ్రీశ్రీ వీరిని బట్టబయలు చేశాడు.
`నీ యిష్టం వచ్చినన్ని పాపాలు చెయ్
భగవంతుడున్నాడు
కొబ్బరికాయ కొడితే చాలు
తుడుకుపోతాయ్ నీ పాపాలు' అని అవహేళన చేస్తాడు అన్ని మతాల వారినీ.
`వెళ్ళు గుడిలోకి
దర్గాలోకి
చర్చిలోకి
అక్కడ అంతా బీభత్సం!
బైటికిరా
విశాల విశ్వంలోకి విరుచుకుపడు!
నన్ను నమ్ము! నా మాట నమ్ము
కుళ్ళు దేవుళ్ళని నమ్మకు
దేవుళ్ళంతా కుళ్ళే' అంటూ ఈ గేయాన్ని పూర్తి చేశారు. మొత్తం ఈ దైవ వ్యవస్థ నిండా పేరుకొని పోయిన కల్మషమంతా బీభత్సంగా ఉందంటారు.
ఇక ఏడవ రచన శాంతరసానికి సంబంధించింది. దీని శీర్షిక `బ్రూహి ముకుందేతి'. జగత్ప్రసిద్ధ తమిళ గాయనీమణి - తెలుగును ఖూనీ చేస్తూ త్యాగరాజ కీర్తనలు పాడుతూ శాంతరసాన్ని వర్షిస్తుంది. ఆమె ప్రపంచమంతా, కమ్యూనిస్టు దేశాలలో తప్ప, తన సంగీతం వినిపించారు. ఒక దశలో ఉచితంగానే కచేరీలు చేయడం ప్రారంభించారు. అయితే విమాన ఖర్చులూ, హోటల్ ఖర్చులూ కార్యక్రమం ఏర్పాటు చేసినవారు భరించాలి.
|