
|
|

General Forum: Literature | మహాత్ముల స్వభావం | |
| mahaatmula lakshaNaalanu chakkagaa vivariMchaaru mUrtigaarU!maLLI Ti.pi lO ilaaMTi aarTikals raavaalani kOrukuMTunnaanu.
Posted by: Mr. narasimham bhamidipati At: 28, Nov 2010 11:38:23 PM IST “విత్తే త్యాగం, క్షమా శక్తౌ ,దుఃఖే దైన్యవిహీనతా
నిర్దంభతా సదాచారే - స్వభావోయం మహాత్మనామ్.”
ధనం ఎక్కువగా ఉంటే త్యాగ గుణం, శక్తి ఉంటే క్షమాగుణం, దుఃఖసమయంలో దైన్యంలేకుండా ఉండటం, ఆచారాలను పాటించటంలో మార్మికత లేకుండా ఉండటం మహాత్ముల స్వభావం. అని ఈశ్లోకానికి అర్ఠం.
విత్తే త్యాగమ్..
నిజానికి సామాన్యంగా ధనంతో పాటు గర్వం, స్వార్థం, పిసినారితనం, ఇంకా సంపాదించాలనే తపన , అందుకోసం చేయరాని పనులు చేయటం మొదలైన లక్షణాలు చాలామందికి వస్తాయి. కానీ ధనాన్ని త్యాగం చేయటం మహాత్ములకే సాధ్యం. కాళిదాసు రఘుంశ రాజుల లక్షణాలను చెపుతూ “త్యాగాయ సంభృతార్థానామ్ ” అన్నాడు. ఆ రాజులు ధనాన్ని కూడబెట్టటం త్యాగం చేయటానికేనట !ధనికులు దీనిని గుర్తించాలి. సమాజంలోని అసమానతలను తగ్గించి , అలజడులను నివారించటంలో ధనికులు తమ త్యాగగుణంతో సహకరించాలి.
క్షమా శక్తౌ ..
శక్తిగల వారు క్షమాగుణం కలిగి ఉండాలి.శక్తి అంటే శారీరక శక్తి కావచ్చు, అధికార శక్తి కావచ్చు. స్వ వర్గ శక్తికావచ్చు. లోకంలో ఎక్కువగా జరిగేది ఏమిటంటే – శారీరక శక్తిగలవారు శక్తిలేనివారిపై విరుచుకు పడతారు. తమ బలాన్ని నిరూపించుకునే అవకాశంకోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరైనా వారి అవసరార్థం తమబలాన్ని వాడుకోవాలనుకుంటే , కొందరు నిస్సంకోచంగా నాలుగు రూకలకోసం అమ్ముడు పోతారు. తమశక్తి దుష్కృత్యాలకు వినియోగింపబడుతోందన్న స్పృహ వారికి ఉండదు. క్షమ అంటే సహనం, నిగ్రహం . శక్తిని సద్వియోగం చేసుకోవటంలో ఔన్నత్యం ఉంది.అధికార శక్తి ఉన్నవారు ఓర్పుతో ఇతరులకు మేలుచేసే ధోరణి కలిగి ఉండాలి. అసలు ముందు , సహాయార్థియై వచ్చినవాడి గోడు వినాలి. కానీ ఈనాడు ఎంతమంది అధికారులకు ప్రజల మొరలు వినే కోరిక,తీరిక ఉన్నాయి ?మరికొందరు తమకు శక్తి లేకపోయినా , తమ ప్రయోజనాలకోసం తమవర్గం వారిని రెచ్చగొట్టి అకారణద్వేషాలు పెంచుతారు. అదృష్టవశాన సంక్రమించిన శక్తిని నియంత్రణలో ఉంచుకొని లోకహితార్థం వినియోగించినవాడు ధన్యుడు.
దుఃఖే దైన్యవిహీనతా ..
సర్వజీవులకూ సుఖదుఃఖాలు ఉంటాయి. సుఖాన్ని అందరూ కాంక్షిస్తారు. దుఃఖమంటే భయపడుతారు. కానీ బండిచక్రంలోని ఆకులవలె సుఖదుఃఖాలు ఒకదాని తరువాత మరొకటి రావటం సహజం. దుఃఖంలో ధైర్యంగా ఉండటం అవసరం. అధైర్యపడితే ఎన్నో అనర్థాలు వస్తాయి. మానసిక బలం కొరవడినవారు కొందరు దుఃఖం వస్తే దీనులైపోతారు. ఇక తాము కోలుకోలేమనుకుంటారు. ఎదుటివారి సానుభూతి కోసం వెంపరలాడుతూ ఉంటారు. ఇదే దైన్యమంటే. దుఃఖాన్ని ధీరంగా ఎదుర్కొన్నవాడు శ్లాఘనీయుడు.ఒకరు మనను చూసి జాలిపడటాన్ని మనం కోరుకోకూడదు.
నిర్దంభతా సదాచారే ..
ఆచారాలన్నీ సర్వజీవ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరింపబడాలి. దురాచారాలు ఎప్పుడూ పరిత్యాజ్యాలే. ఆచారం పేరుతో కొందరు డాంబికంగా ప్రవర్తిస్తూ ఉంటారు. యజ్ఞాలు, క్రతువులు, దీక్షాస్వీకరణలు, సేవాశిబిరాలు , శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఆధ్యాత్మికనేపథ్యంతో కొనసాగితే ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మికత అంటే సమాజంలో సర్వేశ్వరుని చూడగలగటం. అంతటి పవిత్ర భావనతో ఆచారాలు పాటింపబడాలి.కానీ కొందరు ఆధ్యాత్మిక రంగాలను సైతం స్వార్థపరులై కలుషితం చేస్తున్నారు. కేవల ప్రచారసాధనాలుగా ఆచారాలు ఉండరాదు. దంభాచారం చాలా హేయమైనది.ఉత్తములు ఆచారవర్తనలో నిరాడంబరులై ,మర్మం లేనివారై ఉంటారు.
పరమేశ్వర దత్తములైన సర్వసంపదలనూ నిపుణుడై, వినయంతో సద్వినియోగం చేసినవాడే మహాత్ముడౌతాడు. ఇన్ని సంపదలు నాకున్నాయని విచక్షణకోల్పోయి , గర్వంతో అన్యథా ప్రవర్తిస్తే హీనుడౌతాడు. అందుకే “ఉద్ధతులుకారు బుధులు సమృద్ధిచేత ” అన్నారు విజ్ఞులు.
Posted by: Mr. kompellaramakrishna murty At: 28, Nov 2010 8:29:29 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|