|
|
Articles: TP Features | `చిక్కిపోయిన' చిరు - Site Administrator
| |
(రాజేష్ కర్రా)
ప్రజారాజ్యం... ఈ పేరు వింటేనే గుండెల్లో దడ. వెన్నులో చలి. రాటుతేలిన రాజకీయ పక్షాల నేతల గుండెల్లో రైళ్ళు... ఇదంతా ఎన్నికలకు ముందు సీను. ఆకర్ష... స్వగృహ ఈ పేర్లు వింటేనే ప్రజారాజ్యం నాయకులకు నిలువెల్లా వణుకు. పార్టీలో కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయన్న బెదురు... ఇదీ ఇప్పటి దృశ్యం. ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ పార్టీల తలరాతలను మార్చేసింది. కింగ్ ను కాలేకపోయినా కింగ్ మేకర్ అవుదామనుకున్న మెగాస్టార్ పాపం ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీలు కొడుతున్న దెబ్బలను కాసుకోవడంలో పరమబిజీగా ఉన్నారు. నమ్ముకున్న నాయకులంతా ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోతుంటే కళ్ళప్పగించి చూస్తూ నిర్వేదంతో నవ్వుకుంటున్నారు. పోయినోళ్ళు పోయారు గానీ ఉందీలే మంచికాలం ముందుముందునా అన్నయ్యా అంటూ తమ్ముళ్ళు సముదాయిస్తుంటే అదెలా వస్తుందో తెలియక తలపట్టుకుంటున్నారు.
చిరంజీవి ప్రభంజనంతో ఎన్నికల తరువాత తమ స్థానం ఎక్కడ ఉంటుందోనని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం తల్లడిల్లాయి. ఇక వామపక్షాలు, భారతీయ జనతాపార్టీ అయితే ప్రజారాజ్యంతో ఎలాగైనా చెలిమి చేయాలని తహతహలాడాయి. తెలుగుదేశంతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసిన తరువాత కూడా 'ఓటమి' లేకుండా ఉండాలంటే 'ప్రజారాజ్యం' 'ఆసరా' అవసరమని వామపక్షాలు సూత్రీకరించాయి. చివరకు నవ తెలంగాణాను విలీనం చేసుకుని ప్రజారాజ్యం ఒంటరిగానే పోటీ చేయక తప్పలేదు. అది వేరే సంగతి.
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు 'ప్రజారాజ్యం' అంటే కాబోయే అధికారపక్షం అన్నట్లుగా ఉండేది. మెగాస్టార్ చిరంజీవి అంటే 'కాబోయే సీఎం' అనే భావన సర్వత్రా వచ్చింది. చిరు అభిమానుల కోలాహలానికైతే అంతేలేదు. కానీ ఫలితాలు వెల్లడైన తరువాత చిరంజీవి తొలి ప్రయత్నంలో తిరుపతిలో గెలిచి, పాలకొల్లులో ఓడటం ఆ పార్టీ ప్రభావంపై సందేహాన్ని పెంచింది. 'ప్రత్యర్థుల చేతన్, కోవర్టుల చేతన్ మీడియా ప్రచారం చేతన్' అన్నట్లుగా ప్రజారాజ్యం ఓటమితో నిలిచింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే 'నేతల్లేని రాజ్యం'గా ఈ పార్టీ మిగులుతుందా అన్న అనుమానం రాకమానదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|