|
|
Articles: TP Features | కప్పరాజు శాసనం! - Site Administrator
| |
(వి. రాంచందర్)
వానాకాలం రాగానే కప్పలన్నీ తమ 'బెకబెక'లతో మహదానందాన్ని వ్యక్తం చేస్తాయి. తొలకరి వచ్చిందంటే చాలు!... కురిసే వానలకు ఎదురెళ్ళి 'ఎన్నాళ్ళకు వచ్చావ్.... వాన! ఎన్నాళ్ళని దాక్కుంటావ్ పైన' అంటూ 'గంతు'లతో, 'దూకుళ్ళ'తో ఆనంద తాండవం చేస్తాయి. కానీ రాష్ట్రంలో ఈ మధ్య వానాకాలం కరువు కాలంగా మారింది. రైతులంతా 'ఉత్తర చూసి ఎత్తర గంప' అంటున్నారు. కానీ కప్పల దూకుళ్ళు, గెంతులకు రాష్ట్రం 'గంతుల నిలయంగా మారింది!' దీంతో కప్పలంతా తమ నాయకుని ఆధ్వర్యంలో 'ఎండిన చెరువు' సాక్షిగా సమావేశమయ్యాయి. జీవి భేదం లేకుండా చిరు కప్పలు, సోదరు కప్పలు, బోదురు కప్పలు, నీటి కప్పలు, చెట్ల మీద కనిపించే కప్పలు... ఎక్కడెక్కడి నుంచో ఈ సమావేశానికి హాజరయ్యాయి.! కప్పల్లో కనిపించిన ఈ ఐక్యతకు ఉబ్బి తబ్బిబ్బయిన 'నాయకవీర' కప్ప ఆనందంతో గొంతు సవరించింది. 'ఉబయచరులన్నకీర్తి మనకే సొంతం. కప్పగంతులు, కప్ప దూకుళ్ళు కూడా మనవే! కానీ ఇన్నాళ్ల మన వారసత్వానికి 'నాయక' గండం ఏర్పడింది. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులు' అని వివరించింది!
దీంతో ఒక్కసారిగా కప్పలగణంలో ఆందోళన కలిగింది. వారి తరఫున సన్నపాటి కప్ప ఒకటి 'హైజంప్' చేసి మరీ అడిగింది 'మాకేమీ అర్థం కాలేదు. మనకొచ్చిన ముప్పు లేదు. మన దూకుళ్ళ ప్రత్యేకత చెరగదు. ఎందుకు సుఖంగా కాలం వెళ్ళదీస్తున్న కప్ప పౌరుల్ని భయపెడతావ్' అని అడిగింది. 'నేల మనది... నీరు మనది! గెంతులు... దూకుళ్ళు మనవేరా! భయమేలరా?' అంటూ దీర్గాలు తీసింది.
సభకు అధ్యక్షత వహించిన 'ముదురు' కప్ప తనను ప్రశ్నించిన సభ్యుని వైపు 'నీది అజ్ఞానం!' అన్నట్టుగా ఎగాదిగా చూసి నెరసిన గడ్డాన్ని నిమురుకుంది. 'నేను చెప్పింది మీకు అతిగా కనిపించొచ్చు. కానీ ఇది నిజం! ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న'జంప్' లు చూస్తే నన్ను ప్రశ్నించిన చిరంజీవి చేసిన 'హైజంప్' ఒక లెక్క లోనిది కాదు. అక్కడేం జరుగుతుందో... ఈ 'జలదర్పణం'లో చూడండి. తరువాత నేను తీసుకునే అంతిమ నిర్ణయాన్ని మీరు శిరసావహించాలి' అంటూ ఆ వృద్ధ మండూకం తన సమీపంలోని నీటి పాత్రలో చిన్నరాయి వేసింది. ఆ నీళ్ళు సుడులు తిరుగుతూ... 'వెండి తెర'గా మారింది!
...తెలుగునాట ఎన్నికల కోలాహలం ఘనంగా ప్రారంభం కాగానే అనేక ప్రాంతాల నుంచి నాయకులు వలసబాట పట్టారు. ఏ పార్టీకాపార్టీ తాము 'రాజ్యం' చేస్తామన్నా... చివరికి కాంగ్రెస్ కే పట్టం దక్కింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. తమ నెలవులు మారిన నేతలంతా పునరాలోచనలో పడ్డారు. ఒకవైపు ఆపరేషన్ - ఆకర్ష!, మరోవైపు ఆపరేషన్ 'స్వాగత్' మొదలయ్యాయి. 'ఇది ప్రజారాజ్యం కాదు - ప్రైవేట్ కంపెనీ' అంటూ పొలిటీషియన్ కమ్ యాంకర్ పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యానికి వీడ్కోలు పలికారు. మీడియాకు 'లీకు'లిచ్చి... శిక్షణా శిబిరాలు నడిపిన మిత్రా కూడా 'ఇది నా రాజ్యం కాదు' అంటూ నిష్క్రమించారు. రెండు 'స్టార్'లు కలిస్తే తిరుగేముంది. దశ మారుతుంది అంటూ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ నుంచి 'రాజ్యం'లో కలిసిన 'రెబల్' స్టార్ కృష్ణంరాజు కూడా తిరుగుముఖం పట్టారు. శివశంకర్, కెఎస్ ఆర్ మూర్తి వంటి సీనియర్ నేతలు సరేసరి! మొత్తం మీద ప్రజారాజ్యం కాస్తా 'అయోమయ'రాజ్యంగా మారిందని గిట్టని ప్రత్యర్థులన్నారు! 'ఎవరికి ఎవరు! చివరకు ఎవరు మిగలమని రాజకీయంలో.... ముగిసే ఈ పార్టీలో' అంటూ వీరాభిమానులు 'దీనా
లాపనలు' చేస్తున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|