|
|
Articles: TP Features | ఆత్మరక్షణకేనా 'ఆకర్ష్' ? - Site Administrator
| |
(రేణుక)
రాష్ట్ర రాజకీయాలలో తాజాగా నెలకొన్న 'ఆయారాం - గయారాం' సంస్కృతిని ఇంత తీవ్రంగా ఇదివరకెన్నడూ ప్రజలు చూడలేదు. పైగా ఎన్నికలు పూర్తయిన తరువాత పార్టీల నుంచీ (పదవి ఊడి పోకుండా) బయటకు వెళ్ళడం ఎలాగ అన్నదాని కోసం లేఖాస్త్రాలు సంధిండం, ఎన్నికల ముందు పార్టీని వీడిన వారు తిరిగి స్వగృహానికి చేరడం కూడా రాష్ట్ర ప్రజలు గతంలో ఎరగరు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన పార్టీ - ప్రత్యర్థి పక్షాలను చికాకు పరిచేందుకు సామ, దాన, బేధ దండోపాయాలను ప్రయోగిస్తున్న ప్రక్రియ మాత్రం ఇదే తొలిసారి.
1994లో తెలుగుదేశం చేతుల్లో కాంగ్రెస్ పార్టీ - ప్రతిపక్షం హోదా కూడా దక్కించు కోకుండా ఓడింది. 2004 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశాన్ని, పాదయాత్రలతో నేతగా నిలదొక్కుకున్న వైఎస్ ఓడించి కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. సిఎం పదవికి 2004లో ఇతరులు కూడా పోటీ పడేందుకు ప్రయత్నించినా, కాంగ్రెస్ శ్రేణులు అంగీకరించే పరిస్థితులు లేవు. ఈ క్రమంలో తన చిరకాల కోరిక ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న వైఎస్ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. రైతు బంధుగా ముద్ర వేసుకోవడానికి మూకుమ్మడిగా ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇవి తన అనుచర వర్గానికి 'సంపద'లు కూడబెట్టేందుకేనన్న విమర్శలు సరేసరి! 2009 ఎన్నికల్లో ఉపాధి హామీ, జలయజ్ఞాలే తమను గెలిపించే అస్త్రాలుగా వైఎస్ విశ్వసించారు. ఆ మేరకు అధిష్టానాన్ని ఒప్పించి... తిరిగి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను వైఎస్ తన భుజాలకెత్తుకున్నారు. అయితే బొటాబొటి మెజారిటీ (156 స్థానాలు) మాత్రమే కాంగ్రెస్ కు దక్కింది. ప్రదాన ప్రతిపక్షం తెలుగుదేశానికి 90 స్థానాలు దక్కాయి. చిన్న పక్షాలు చతికిల పడ్డాయి. తామే అధికారంలోకి వస్తామని భావించిన ప్రజారాజ్యం 18 స్థానాలకే పరిమితమైంది.
ఎన్నికల అనంతరం అధికారాన్ని అనుభవించేందుకు ముఖ్యమంత్రి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పైగా 2014 నాటి ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. అందుకోసం ప్రత్యర్థి పక్షాలనేవే లేకుండా చూసేందుకు 'ఆపరేషన్ ఆకర్ష్'ను ప్రయోగించారు. ఈ వ్యూహం ఒక్క తెలుగుదేశం పైనే కేంద్రీకృతమైందంటే - ప్రత్యర్థిని బలపడనీయకూడదన్న వ్యూహంగా అర్థం చేసుకోవచ్చు. కానీ రథ చక్రాలు విరిగి, శరీరమంతా గాయాలై పడి ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని, చాలా పరిమిత స్థానాలనే సాధించిన ప్రజారాజ్యాన్ని, చివరకు వామపక్షాలను కూడా ఆపరేషన్ ఆకర్ష్ విడిచి పెట్టలేదు. కాంగ్రెస్ లోకి ఇతర పార్టీలనుంచి ఎవరొచ్చినా గేట్లు ఎత్తేసామన్న సంకేతాలను సర్వత్రా పంపారు. గత ఎన్నికల్లో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పుంజుకోకూడదన్న ధృఢసంకల్పంతో కాంగ్రెస్ శ్రేణులు పని చేసేలా వైఎస్ మార్గ దర్శనం చేశారు. చివరకు వామపక్షాల ఉద్యమంలో కాల్పులకు దారితీసిన 'ముదిగొండ' ఉన్న నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పరమైంది.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|