|
|
Articles: My Thoughts | శ్రీశ్రీ తెలుగుల సిరి - Site Administrator
| |
నన్నయ మహాభారతాన్ని తెలుగువారికందిస్తూ 'జగత్తు హితంకోసం' కవిత్వం వ్రాస్తున్నానన్నాడు. తిక్కన 'ఆంధ్రావళిమోదం' కోసం కవన మల్లుతున్నట్లు చెప్పాడు. వేమన ఏమీ చెప్పకుండానే ప్రజల కోసం కవిత్వం రాశాడు. గురజాడ దేశమంటే మనుషులని మొదటిసారిగా చెప్పి, ముందుకు అడుగేస్తేనే మనుగడ సాధ్యమని స్పష్టం చేశాడు.
'నేను సైతం' అనే రెండు మాటల్తో తెలుగు కవిత్వం జాడనే మార్చేసిన మహాకవి శ్రీశ్రీ. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అని మొదలుపెట్టి 'నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను' అని ఆశావాదంతో 'జయభేరి' మ్రోగించిన ముందుచూపు కవి శ్రీశ్రీ. ఈ కవిలో ఉన్న విశేషం ఏమిటంటే కవిత్వం ఎలా రాయాలో, ఎందుకు రాయాలో, ఎలాంటి వస్తుల్ని తీసుకొని రాయాలో, అసలు కవిత్వం ఎలాంటిదో చెప్తూనే 'కవిత్వం ఇలా ఉండాలి' అని సోదాహరణంగా రాయటం. శ్రీశ్రీ అంత స్పష్టంగా కవిత్వ లక్షణాల్ని కవిత్వంగానే చెప్పిన కవి మరొకడు లేడు. శ్రీశ్రీ రాసిన ఒక్కొక్క పదానికి పది అర్థాలు చెప్పవచ్చు. ఒక్కొక్క కవితమీదనే ఒక్కొక్క సిద్ధాంత వ్యాసం వ్రాయవచ్చు. 'కదిలేది కదిలించేందీ, మారేదీ మార్పించేదీ, పాడేదీ పాడించేదీ, పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ కావాలోయ్ నవకవనానికి' అని ఇంత సూటిగా కవిత్వ ప్రయోజనాన్ని చెప్పిన లక్షణకారుడు మరొకడు లేడు.
నా పదిహేనేళ్ళ వయసులో మొదటిసారి 'మహాప్రస్థానం' చదివాను. అప్పట్లో శ్రీనాథుడిలాంటివారే కవులని బలంగా నమ్మేవాణ్ణి. అందుకని శ్రీశ్రీ రాసిన 'ఋక్కులు' పిచ్చి రాతల్లా అనిపించాయి. 'కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా' ఇదేమిటి కవిత్వమనుకున్నాను. తర్వాత తెలిసింది, ఒక్కొక్క పదం వెనుక వేల సంవత్సరాల మానవ సాంస్కృతిక చరిత్ర ఉందని వేట మానవుడి మొదటి వృత్తి, కుక్క మానవుడికి మొదటి తోడు, అగ్గి మానవ సంస్కృతికి మొదటి మెట్టు. నిప్పును పుట్టించిన నాటినుండి అగ్గిపుల్ల పుట్టేవరకు మానవ సంస్కృతి వికసించింది. సబ్బుబిళ్ళ కార్మిక శక్తికి సంకేతం. కవిత్వదాహముండే వారికిగాని ఈ సాంస్కృతిక చరిత్రలోని మర్మాలు అర్థం కావు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|