|
|
Articles: TP Features | భద్రతపై ఉదాసీనత - Site Administrator
| |
(చలసాని నరేంద్ర)
నాడు ఇందిరాగాంధీ, ఆ తరువాత రాజీవ్ గాంధీ, ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి... దారుణమైన పరిస్థితుల్లో మరణించిన విషయం తెలిసిందే. కీలకమైన అధికార పదవుల్లో ఉన్న ఈ నాయకులు భద్రతా లోపం కారణంగానే మృతి చెందడం అత్యంత బాధాకరం. ఇందిరాగాంధీ హత్యానంతరం కీలక పదవులలో ఉన్న నాయకుల భద్రత పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా భద్రత విషయంలో ఉన్నతాధికారులు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు పలు పర్యాయాలు స్పష్టం అవుతున్నది.
కీలక పదవులలో నియామకాలు జరిగినప్పుడు ప్రతిభ ఆధారంగా కాకుండా రాజకీయ అంశాలను, వ్యక్తిగత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటుండడంతో ఇలాంటి దారుణాలకు ఆస్కారం ఏర్పడుతున్నది. రాజశేఖరరెడ్డి మృతి సంఘటనలో భద్రతా వైఫల్యమే ప్రధాన కారణం అని స్పష్టం అవుతున్నది. అయినప్పటికీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న చర్యలేవీ కనిపించడంలేదు. కేవలం దర్యాప్తుల పేరుతో కాలయాపన చేస్తుండడం అధికారంలో ఉన్న వారి బాధ్యతా రాహిత్యాన్నే సూచిస్తున్నది.
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన పదిహేను రోజుల ముందుగానే నిర్ణయం అయినా ప్రభుత్వ దగ్గర ఉన్న కొత్త హెలికాప్టర్ సిద్ధంగా లేకపోవడం, లోపభూయిష్టమైన పాత హెలికాప్టర్ ను ఆయన ప్రయాణానికి వినియోగించడం ఎంత దారుణం! అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ దుర్ఘటనకు బాధ్యులను ఒక్క గంటలోనే గుర్తించవచ్చు. అయితే, అలాంటి ప్రయత్నమేదీ జరిగినట్లు కనిపించలేదు.
రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలంటూ శిబిరాలు నడుపుతున్నవారు, నినాదాలు చేస్తున్నవారు, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నవారు వైఎస్ విషాద మరణానికి కారణమైన వారిపై చర్య గురించి పట్టుపట్టని పరిస్థితి ఎందుకు దాపురించింది? పరామర్శకు వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్ద భద్రతా వైఫల్యాల గురించి రాజశేఖరరెడ్డి శ్రీమతి విజయమ్మ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబాయిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదలు బీభత్సం సృష్టించడంతో భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. అందుకు బాధ్యులుగా చేస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ ల చేత పదవులకు రాజీనామా చేయించారు. అయితే, అదే సమయంలో ప్రధాన మంత్రి భద్రతా సలహాదారు నారాయణన్ చేసిన రాజీనామాను మాత్రం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదించలేదు. భద్రతా వైఫల్యాలకు రాజకీయ నాయకుల కన్నా భద్రతా సలహాదారుడే ఎక్కువ బాధ్యత వహించవలసి వస్తుందనడంలో సందేహం లేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|