|
|
Articles: TP Features | పాపం! ప్రజారాజ్యం - Site Administrator
| |
(ప్రసాద్ గాలిదేవర)
సిద్ధాంతం లేని దివాళాకోరుతనం. సినిమా గ్లామరే సిద్ధాంతం. దాని మీదే భ్రమలతో కూడిన విపరీత నమ్మకం. సంవత్సరం క్రితం ఇవే రోజుల్లో కోట్లాది మంది తెలుగు ప్రజలకు, అభిమానులకు ఎన్నో ఆశలు పెంచుతూ, ఆశయాలు పంచుతూ పుట్టిన ప్రజారాజ్యం పార్టీ ఏడాది తిరిగే సరికి దివాళా తీసింది. సినిమా నటుడిగా ముప్పై సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న అభిమాన కోటిలో ఈ ఏడాది కాలంలోనే అత్యధికులను ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి దూరం చేసుకున్నారు. సామాన్యుడు కూడా అధికారంలో భాగస్వామి కావడానికి ప్రజారాజ్యం పాటు పడుతుందని భావించిన బడుగు, బలహీన, పీడిత, తాడిత వర్గాలు టిక్కెట్ల కేటాయింపులను గమనించే నిరాశకు గురయ్యాయి. సామాజికవర్గాల ప్రస్తావన రాజకీయ నినాదం కావడంతో బలహీనులు తమకు తెలియకుండానే బలమైన వర్గాల వారిని శత్రువులుగా మార్చుకున్నారు. ఎన్నికల అనంతరం పార్టీ చిధ్రమైపోయి దాదాపు మృతప్రాయమైందన్న అవేదన మిగిల్చింది. ఉనికిని కాపాడుకోడానికి వెంపర్లాట మొదలైంది. దానిలో భాగమే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు అన్న సినిమా విడుదలై అట్టర్ ప్లాఫయింది.
కాంగ్రెస్ తో పొత్తు అనగానే వివిధ వర్గాల నుంచి, వ్యక్తుల నుంచి వచ్చిన ముప్పేట దాడులను ఎదుర్కోవడంలో ప్రజారాజ్యం నేతలు ఘోరంగా విఫలమైన ప్రత్యక్ష దృశ్యాలు కళ్ళెదుట కనిపించాయి. పొత్తును సమర్ధించుకునే క్రమంలో ప్రజారాజ్యం నేతల మాటల్లో సైద్ధాంతిక శూన్యత బట్టబయలైంది. ప్రజారాజ్యం ఆవిర్భావ ఆవశ్యకతను అశేష ఆంధ్ర ప్రజలకు ఆ పార్టీ అధినేత చిరంజీవి ఇంత కాలం వినిపించిన ఆదర్శసూత్రాల ప్రస్తావనే లేకుండా పోయింది. కొంతమందైతే గొంతు పెంచేసి నోరేసుకుని పడిపోతే చెల్లుబాటు అయిపోద్దని, ప్రజలు నమ్మేస్తారనే బలమైన నమ్మకంలో ఉన్నారని కూడా అనిపించింది. రాజకీయంగా ప్రజారాజ్యం కొత్తగా నేర్చుకున్న పాఠాలు ఏమీ లేవనే డొల్లతనాన్ని 'కాంగ్రెస్ పొత్తు' అంకం బయటపెట్టింది. పొత్తు కుదిరిపోయిందని పూర్తిగా నమ్మేసి ఆ మత్తులోనే కూరుకుపోయిన ప్రజారాజ్యం నాయకులు ఒకవేళ వ్యూహం వికటిస్తే గౌరవప్రదంగా బయటపడే మార్గాలను ముందుగా చూసుకోలేకపోయారన్నది నిర్వివాదాంశం.
కాంగ్రెస్ తో పొత్తు అనే అంశం అకస్మాత్తుగా ప్రజల ముందుకు వచ్చింది ఆదివారం సాయంత్రమే. నిజానికి దీనికి అంకురార్పణ జరిగింది మాత్రం ఢిల్లీలోనే అని విశ్వసనీయవర్గాల కథనం. గ్రేటర్ సమాలోచనల పేరుతో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కొంతమంది సీనియర్లతో కలిసి పొత్తు పథక రచన చేశారని చెబుతున్నారు. చిరంజీవితో లోపాయికారీ సాన్నిహిత్యాన్ని చాలా కాలం నుంచి కొనసాగిస్తున్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను డిఎస్ ఢిల్లీ పిలిపించుకున్నారని, కేశవరావు, డిఎస్, బొత్స కలిసి చిరంజీవితో పొత్తు ఆలోచనను సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చెవిన వేశారని అంటున్నారు. అక్కడ ఆమోదముద్ర వేయించుకున్న ధైర్యంతోనే ఇక్కడ ముఖ్య కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని మాటమాత్రంగానైనా తెలుసుకోకుండా డిఎస్ ఎకాయెకిన ప్రజారాజ్యం నేతలను చర్చలకు పిలిచారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఆలోచనలను చిరంజీవికి ఎప్పటికప్పుడు బొత్సే తెలియచేశారని, అన్నీ అనుకూలంగానే ఉన్నాయని నమ్మిన చిరంజీవి అనూహ్యంగా కలిసివస్తున్న అవకాశం అనుకుని పొత్తుకు తలూపారని వివరిస్తున్నారు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|