|
|
Articles: TP Features | సుప్రీంకోర్టు గొప్ప తీర్పు - Site Administrator
| |
ఒక జాతి సంస్కృతి ఆ జాతి జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. వారి కట్టూబొట్టూ మీదే కాక వారి కట్టుబాట్ల మీద, వారి విందు వినోదాల మీద, వారి ఆటపాటల మీద, భావజాలం మీద, వారి నడవడిని ప్రభావితం చేసే వారి మౌలిక విలువల మీద ఆధారపడి వికసిస్తుంది. నిజానికి సంస్కృతి పరిరక్షణలో, పోషణలో భాష పాత్ర అద్భుతమైనది. అంచనాలకు అందనిది. మతానికి అతీతమైనది. ఒక వ్యక్తి జీవితంలో నైతిక విలువలకు తల్లితండ్రులు, గురువులు (ప్రాథమిక స్థాయిలో) బీజం వేస్తే దాన్ని పెంచిపోషించే బాధ్యతను భాష తన నెత్తిపై వేసుకుంటుంది. ఎందుకంటే భాష సజీవమైనది. అది నిరంతరంగా కొనసాగుతూ, ఆ భాష మాట్లాడే వారి జీవన విధానాన్నీ, ఆచార వ్యవహారాలనీ, జీవన విలువలనూ, తన పలుకుల ద్వారా, సామెతల ద్వారా, పద్యాల ద్వారా, గీతాల ద్వారా, జానపద కథలూ, గేయాల ద్వారా, శతకాల ద్వారా అజరామరమైన కావ్యాల ద్వారా చక్కగా ప్రతిబింబిస్తుంది. గుర్తుచేస్తూ ఉంటుంది. అవసరమైన చోట్ల మార్పులు తీసుకొని వస్తుంది. మతాల్లోని మంచి సూక్తులు కూడా భాష ద్వారానే వెల్లడి అవుతాయి. భాష ఈ విధంగా తన పనిని తాను, నిశ్శబ్దంగా, నిగూఢంగా సమర్ధవంతంగా నిర్వహిస్తూనే ఉంటుంది.
అలాగే భాషకీ, సంస్కృతికీ అంత విడదీయరాని అనుబంధం ఉన్నదన్నమాట. అందుచేత ప్రాథమిక స్థాయిలోనే తమ మాతృభాషతో తెగతెంపులు చేసుకున్నవారు తమ సంస్కృతికీ, సాంస్కృతిక వారసత్వానికీ దూరమౌతూ కాలక్రమాన వాటికి స్వస్తి చెపుతున్నారు. మంగళం పాడుతున్నారు. ఈ పదాలను నేను కావాలనే వాడాను. స్వస్తి, మంగళం అనే పదాల అర్థం తెలుగు మాటాడే వారందరికీ తేటతెల్లం. తెలుగుకు విడాకులిచ్చిన వారికి ఎలా వివరించగలం? వారి మూలాన ఆ పదాలు భాషలో నుండే కాక, వారి సంస్కృతి నుండి కూడా తప్పుకుంటాయి. ఇటువంటి ఉదాహరణలు కోకొలల్లు. ఇంతకంటే విషాదకరమైన పరిణామాన్ని ఊహించగలమా?
భాష ప్రజలను విడదీస్తుంది. వారిని కలుపుతుంది. వారికి చేరువ అవటానికి దోహదం చేస్తుంది. దాని శక్తి అమోఘం. దానిని గుర్తించారు కనుకనే క్రైస్తవులు తమతమ ప్రచారానికి మతగ్రంథాలను తెలుగులోకి అనువదించారు. లెక్కకు మించి గేయాలను రచించారు. అందుచేతనే తెలుగులో ముద్రితమైన మొదటి పుస్తకం బైబిలు అయింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|