|
|
Articles: TP Features | తెలంగాణ - ఆత్మహత్యలు - Site Administrator
| |
సిద్దిపేటలో కెసిఆర్ చేయనున్న దీక్ష భగ్నం తర్వాత సిద్దిపేట వేదికపై హరీష్ రావు తనపై పెట్రోల్ చల్లుకున్నారు. ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించారు. పోలీసులు తన దగ్గరకు రావద్దని వస్తే కాల్చుకుంటానని హెచ్చరించారు. అది ఉద్యమంలో వ్యూహాత్మకంగా చేసిన పనే కావచ్చు. కాని ఇలాంటి చర్యలు అమాయకులను ప్రభావితం చేస్తాయి. వారు అన్యాయంగా అంటించుకొని చనిపోవడానికి ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఇలాంటి టాక్టిక్స్ కు నాయకులు పాల్పడకపోవడం మంచిది.
'తల నరుక్కుంటా', 'అవసరమైతే నా ప్రాణాలను అర్పిస్తాను', 'తెలంగాణాను అగ్నిగుండంగా మారుస్తాం', 'రక్తం ఏరులై పారుతుంది' అనే మాటలను కూడా నాయకులు ప్రయోగించకపోవడం మంచిది. ఇలాంటి మాటల ప్రభావం అమాయకులు, ఉద్యమకాంక్ష బలంగా ఉన్న లేత మనస్సులపై గాఢంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. '1969-70 ఉద్యమంలో దాదాపు 400 మంది యువజనులు, సామాన్యులు చనిపోయారు. ఈసారి చావాల్సి వస్తే ముందు మేముంటాము అని జయశంకర్ నల్గొండ బహిరంగ సభలో అన్నారు. 80 ఏళ్ళు పైబడిన కేశవరావ్ జాదవ్ తెలంగాణ చూసి చనిపోవాలని ఉంది అని అంటారు. ఇలాంటి పెద్దవారు కూడా 'తెలంగాణకు, చావులకు' ఎందుకు లింకు పెడుతున్నారో తెలియదు. 1945-46 నుండి నేటి దాకా లక్షలాది మందిని బలి ఇచ్చింది. ఇంకా ఎన్ని చావులు - శవాలు కావాలి.'
ఆత్మహత్య పిరికి చర్య. పలాయనవాదులు ప్రయోగించే చివరి నిస్సహాయ అస్త్రం అని కొందరు వివరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకు నిజమైన దు:ఖం తప్ప లాభం ఏమీ ఉండదు. ఒక విద్యార్థి చనిపోగానే హమ్మయ్య ఉద్యమానికి కొంద ఇంధనం దొరికింది అని సంతసిస్తున్న రాజకీయ నాయకులు కొందరన్న మాట అవాస్తవం కాదు. బహుశా వీరు బయటకి సంతాపం ప్రకటిస్తూ లోపల సంతోషిస్తూ ఉంటే అది సరైనదేనా? ఏ చావు అయినా, ఆత్మహత్య అయినా ఇలాంటి వారికి ఉపకరించవద్దు. ఎవరైనా ఆత్మహత్యల ద్వారా తాను లేకుండా ఎవరి ఉద్యమాలనో పోషించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆత్మహత్య ద్వారా రాజకీయ ఉద్యమానికి ఇంధనం కావాల్సిన అవసరం ఏమీ లేదు. 'నీవు లేని తెలంగాణ నీకు అవసరం లేదు' ఇలాంటి బడ్డలు తెలంగాణ తల్లికి కూడా అవసరం లేదు.
మృతిని చావును గ్లోరిఫై చేస్తూ మరణ గానాలు చేసే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. శైవ మతంలో శరీరాన్ని హింసించుకోవడం, ఆత్మత్యాగం చేయడం, ఊరి కోసం, జనం కోసం మరణించిన వారి పేర వీరగళ్ళు నిలిపే సంప్రదాయం ఉంది. జైనం ఒక రకమైన ఉపవాస మరణాలను ఆచరిస్తుంది. ఇస్లాంలోని షియా మతస్తులు కూడా స్వీయ హింసను ఆచరిస్తారు. జాతీయ ఉద్యమంలో మరణించిన వారి స్మృతి చిహ్నాలు దేశమంతటా వెలిశాయి. ఒక వ్యక్తి పోరాటంలో, ఉద్యమంలో మరణించగానే అతనిపై ఒక పోస్టర్ వేసి, ఒక కవిత రాసి స్థూపం కట్టి, ఒక పాటల కేసెట్ తీసి మరొకడిని చావడానికి సిద్ధం చేసే సంస్కృతి కూడా ఉంది. మరణించిన వ్యక్తిని బ్రతికి ఉండగా పెద్దగా పట్టించుకోని పార్టీ పెద్దలు చనిపోగానే అమరుడని, త్యాగధనుడని కీర్తిగానం చేయడాన్ని కూడా గమనిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఉద్యమంలో కార్యకర్తలను ప్రాణత్యాగం చేయడానికి సంసిద్ధులను చేయడం చూశాం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|