'శ్రీవారి సేవ' ఇక సులభం
తిరుపతి ః తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవ టిక్కెట్లు పొందడం ఇకపై సులువుగా మారనున్నది. తిరుమలలోని శ్రీవారి కేంద్రీయ విచారణ కార్యాలయం సి.ఆర్.ఓ. ప్రాంగణంలో ఈ టిక్కెట్లను జారీ చేసేందుకు 8 కౌంటర్లను దేవస్థానం కార్యనిర్వహణాకారి కె.వి.రమణాచారి సోమవారం ప్రారంభించారు. ఇంతవరకూ స్వామివారి సేవల టిక్కెట్లను వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ వద్ద ఆర్జితం కార్యాలయంలో టిక్కెట్లు విక్రయించేవారు. వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ వద్దకు వచ్చి వచ్చి సేవ టిక్కెట్లు తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో టిటిడి ఈ ఏర్పాటు చేసింది.
స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సి.ఆర్.ఓ. వద్దే బస్సులు దిగుతారు. కొత్తగా చేసిన ఏర్పాటు వల్ల బస్సు దిగిన వెంటనే వారు సి.ఆర్.ఓ.లోకి వెళ్ళి సేవల టిక్కెట్లు తీసుకోవచ్చు. దీనితో పాటు ఇవే కౌంటర్లలో స్వామివారి ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లను కూడా కరెంట్ బుకింగ్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పించారు. అర్చన తరువాత దర్శనం, సుప్రభాతం, కల్యాణం, తోమాల, అర్చన, సహస్ర దీపాలంకరణ లాంటి సేవ టిక్కెట్లను కూడా ఈ కౌంటర్లలోనే తీసుకోవచ్చు. సెల్లార్ టిక్కెట్లను కూడా ఈ కౌంటర్ల నుంచే త్వరలో అందజేయనున్నట్లు కార్యనిర్వహణాధికారి రమణాచారి ఈ సందర్భంగా వెల్లడించారు.
News Posted: 9 February, 2009
|