టిటిడి అత్యవసర సమావేశం
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ గట్టి పోలీసు బందోబస్తు మధ్య అత్యవసరంగా సమావేశమైంది. ఇంతకు ముందు జరిగిన సమావేశాన్ని తిరుమల నిర్వాసితులు అడ్డుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా 144వ సెక్షన్ విధించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే, ఈ నెలాఖరున జరగాల్సిన పాలకమండలి సమావేశం పదిహేను రోజులు ముందుగా శనివారమే సమేవేశం కావడం గమనార్హం. ట్రస్ట్ బోర్డ్ లో రాజకీయ నాయకులు సభ్యులుగా, చైర్మన్ గా ఉండడంతో రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్నందున ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేదు. కాగా, మే ఐదవ తేదీ నుంచి తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. ఏడుగురు వేద పండితులను నియమించేందుకు పాలకమండలి ఆమోదించింది.
మరో పక్కన టిటిడి అన్నదానం నిధులను ఇతర సంస్థలకు మళ్ళిస్తే చూస్తూ సహించేది లేదని టిటిడి ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. టిటిడి పాలక మండలి తీరుపై ఆ సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులను శృంగేరి, ఉడిపి మఠాలకు బదలాయించడంపై టిటిడి ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా పోలీసులు అన్నమయ్య భవన్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పాలక మండలి తన విధానాలను మార్చుకోకపోతే ఎన్నికల అనంతరం ఆందోళనలు చేయాల్సి వస్తుందని టిటిడి ఉద్యోగ సంఘం నాయకుడు విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
News Posted: 14 March, 2009
|