ఎన్నికలకు ఎన్.సి.సి సేవలు
(వేముల సదానందం)
వరంగల్ : ఎన్నికల సందర్భంగా జాతీయ సేవా కార్యక్రమంలో పాల్గొనే ఎన్.సి.సి విద్యార్థులు తమ యూనిట్ ఆఫీసర్లను సంప్రదించవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి కోరారు. ఆయన కలెక్టరు చాంబరులో కళాశాలల ప్రిన్సిపాల్స్, మరియు అసోసియేట్ ఎన్.సిసి. అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్.సి.సి.అధికారులు 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జాతీయ సేవా కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల జాబితా జిల్లా ఎన్నికల అధికారికి అందచేయల్సి ఉన్నందున పరీక్షలు పూర్తయి స్వగ్రామాలకు వెళ్ళిన విద్యార్థులు వెంటనే ఫోన్ ద్వారా తమ యూనిట్ అధికారులను సంప్రదించవలసిందిగా కోరారు. 15 కళాశాలలనుండి 1450 మంది బాలురు, 500 మంది విద్యార్థినులు ఈ ఎన్నికల సందర్బంగా నగర పరిధిలోని 3, 4 కన్నా ఎక్కువ పోలింగు స్టేషన్లు ఉన్న కేంద్రాల వద్ద ఓటర్లకు సౌకర్యాలు కల్పించుట, ఓటర్లను వరుసలో ఉంచుట వారికి తగిన వివరాలు తెలుపుట వంటి సేవలు చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా పోలింగ్ స్టేషన్ల వద్ద విద్యార్థినులను నియమించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులకు రాను పోను, ఖర్చులతో పాటు, రోజువారి జీతభత్యాలను చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్.పి.వి.సి.సజ్జనార్, కల్నల్ వై.ఎస్.రావు, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ శ్రీధర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఎన్.సి.సి.యూనిట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
News Posted: 27 March, 2009
|