ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మృతి
కోలార్ (కర్ణాటక) : కోలార్ సమీపంలోని కుంబారహళ్ళి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రమీల, కారు డ్రైవర్ సంఘటనా స్థలం వద్దే మరణించారు. గంగాథర్ కుమార్తె మేఘనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మేఘనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. బెంగళూరులో విద్యాభ్యాసం చేస్తున్న గంగాధర్ రెడ్డి కుమారుడి వద్దకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న టాటా సుమోను ఒక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
గంగాధరరెడ్డి ఇంతకు ముందు అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత జరిగిన ఎన్నికల్లో గంగాధరరెడ్డి పుంగనూరు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. తెలుగుగంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా కూడా గంగాధర్ రెడ్డి పనిచేశారు. గంగాధర్ రెడ్డి మృతికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. చిత్తూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా గంగాధర్ రెడ్డి మూడు వారాల నుంచి పనిచేస్తున్నారని తెలుస్తోంది.
News Posted: 25 April, 2009
|