కుప్పం ప్రజలకు బాబు కృతజ్ఞత
హైదరాబాద్ : ఆదరణ, అభిమానం ప్రదర్శించి మరోసారి తనను భారీ మెజారిటీతో శాసనసభ్యునిగా గెలిపించిన చిత్తూరు జిల్లా కుప్పం ప్రజలకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజలు అందించిన ఈ విజయం తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. కుప్పం నియోజకవర్గం ప్రజలు 1989 నుంచీ తన పట్ల ప్రేమానురాగాలు, ఆదరాభిమానాలు ప్రదర్శిస్తూ తన రాజకీయ జీవితంలో చెప్పలేనంత స్ఫూర్తిని అందిస్తున్నారని మంగళవారంనాడు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విడుదల చేసిన ప్రకటనలో చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.
తన విజయాన్నే వారి గెలుపుగా భావించి దృఢ దీక్షతో, ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు చంద్రబాబు హృదయపూర్వక అభివందనాలు అందించారు. అందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపేందుకు సాధ్యమైనంత త్వరలోనే అందరి వద్దకూ వస్తానని చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి, సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
News Posted: 20 May, 2009
|