పులకించిన కృష్ణమ్మ
విజయవాడ : ప్రజల్లో భక్తిభావన పెంపొందిస్తూ, హైందవ ధర్మాన్ని విస్తృత పరచాలనే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన శ్రీహరి దివ్యనామ సంకీర్తనోత్సవం `భజగోవిందం' విజయవంతంగా ముగిసింది. తిరుమల నుండి నగరానికి తీసుకువచ్చిన శ్రీవారు, శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ముందుగా వేదమంత్రోచ్ఛారణలమధ్య వేదిక వద్దకు తీసుకువచ్చారు. తదుపరి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య భజనలతో, విష్ణుసహస్రనామ పారాయణ, అన్నమాచార్య కీర్తనలు, భజగోవింద నామాలతో భక్తకోటి పునీతులయ్యారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన భజన బృందాల గోవింద నామస్మరణతో కృష్ణమ్మ పులకించిపోయింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు లక్ష మంది పైగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ కెవి రమణాచారి, జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీధర్ నగర మేయర్ రత్నబిందు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 1 June, 2009
|