గోపురాల దొంగల ముఠా అరెస్ట్
(వేముల సదానందం)
వరంగల్ : అంతర్ జిల్లాల దొంగల ముఠాను వరంగల్ జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడి భారీ ఎత్తున నగలు చోరీ చేసిన ఓ ముఠాను స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ ఘరానా దొంగల ముఠా 43 దొంగతనాలకు పాల్పడగా అందులో 28 దోపిడీలు వరంగల్ జిల్లాలో చేశారని ఆయన అన్నారు. 14 దేవాలయాల్లో ముఖ్యమైనది భువనేశ్వరి మాతా దేవస్థానం దోపిడీ పెద్దదన్నారు. అమ్మవారికి చెందిన 75 తులాల బంగారు నగలు, 29 కిలోల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ ముఠా వరంగల్ జిల్లాలో 105 తులాల బంగారం, 43 కిలోల వెండి, 634 కిలోల ఇత్తడిని దొంగిలించగా వీరి వద్ద నుండి 90 తులాల బంగారం, 37 కిలోల వెండి 950 కిలోల ఇత్తడి స్వాధీనపర్చుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఘరానా గోపురాల దొంగల ముఠా ఆంజనేయ స్వామి దేవాలయాల జోలికి వెళ్ళదని, వెంకటేశ్వరస్వామి దేవాలయాలను ఎంచుకుని గ్రామానికి దూరంగా ఉన్న ఈ ఆలయాల్లో తాళాలు పగలగొట్టి దోపిడీలకు పాల్పడ్డారని ఆయన వివరించారు. స్టేషన్ ఘన్ పూర్ లోని బుగులు వెంకటేశ్వరస్వామి దేవాలయం (చిలుపూర్ గుట్ట)లో దొంగతనం చేయడానికి మూడుసార్లు విఫలయత్నం చేశారని ఎస్పీ సజ్జనార్ చెప్పారు.
ఇది ఇలా ఉండగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో దోపిడీ చేసిన 325 కేజీల రాగిని వరంగల్ పోలీసులు ఇక్కడ రికవరీ చేశారు. ఆరుగురు సభ్యులు ఉన్నఈ దొంగల ముఠాలోని నలుగురుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు జిల్లా ఎస్పీ విసి సజ్జనార్ విలేఖరుల సమావేశంలో తెలిపారు. అరెస్ట్ అయినవారిలో నల్గొండ జిల్లా నేరేడుచెర్ల గ్రామానికి చెందిన పురం వెంకన్న (35), మిర్యాలగూడ మండలం బంగారుగడ్డకు చెందిన కట్ల బాబురావు(58), చింతపల్లికి చెందిన అంగోతు రమేష్ (31), వరంగల్ జిల్లా మరిపెండ మండలం బాబోజీ గూడేనికి చెందిన ఎనమల్ల నాగరాజులు (30) ఉన్నారు. సిద్ధిపేటకు చెందిన దీకొండ శ్రీను (26), నల్గొండ జిల్లా గాంధీనగర్ కు చెందిన చేవూరి అనంతచారి (39) లు పరారీలో ఉన్నట్లు సజ్జనార్ తెలిపారు. వరంగల్ జిల్లా డిఎస్పీ శాంతికుమార్ నేతృత్వంలో సిఐలు మురళీధరరావు, దక్షిణామూర్తి, ఎస్సై డేవిడ్ రాజులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరికి ఎస్పీ విసి.సజ్జనార్ నగదు రివార్డు అందజేశారు.
News Posted: 15 July, 2009
|