హాస్యనాటికల పోటీలు
విజయవాడ : తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రేపటి నుండి హాస్యనాటికల పోటీలు నిర్వహించనున్నారు. సుమధుర కళానికేతన్ 36వ వార్షికోత్సవం సందర్భంగా 14 హాస్యనాటికల పోటీలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రదర్శించనున్నారు. ఈసారి ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. మొత్తం 50 ఎంట్రీలు రాగా 46 ఎంట్రీలను స్క్రూటినీ చేశారు. ఇందులో 12 ఎంట్రీలు నగరం నుంచి వచ్చాయి. మొత్తం మీద 14 నాటికలను ఎంపిక చేశారు.
ఈ పోటీలలో మొదటి నాటికగా భీమవరానికి చెందిన గురజాడ కళానికేత్ వారు `మందు జనా సుఖినోభవన్తు' అను నాటికను ప్రదర్శిస్తారు. తదుపరి హైదరాబాద్ ఏపీఎస్ ఆర్ టీసీ ఆర్ట్స్ కో వారి `రామచిలుక', విజయవాడ ఇమ్మడి లింగయ్య సరోజని మెమోరియల్ వారి `టీవీ చూతం రారండి', న్యూఢిల్లీ శ్రీకృష్ణ తెలుగు థియేటర్స్ ఆర్ట్స్ `వారేవా...డైమండ్ నెక్లెస్', ఉయ్యూరు వికటకవి కల్చరల్ యూనిట్ `ఆనంద నిలయం - టులెట్', హైదరాబాద్ విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారి `కొత్తచుట్టం', విశాఖపట్నం సాయి స్నేహ క్రియేషన్స్ వారి `చీమకుట్టిన నాటకం', విజయవాడ సాంస్కృతిక సమాఖ్యవారి `ఉండమ్మా ... ఒట్టుపెట్టా', ఖరగ్ పూర్ ప్రవాసాంద్ర నవ్యకళాపరిషత్ వారి `పుత్రోత్సాహం', హైదరాబాద్ వారి కళావర్షిణి వారి `గుండమ్మగారి లేడీస్ హాస్టల్', కొలకలూరు కళాలయ వారి `అక్కడ... ఇక్కడ... ఎక్కడ', ఒంగోలు అభినయ వారి `నువ్వు నాకు తోడుంటే', హైదరాబాద్ మల్లాది క్రియేషన్స్ వారి `హాయిగా నవ్వండి', హైదరాబాద్ ఆర్ కె థిటేయర్ ఆర్ట్స్ వారి `వంట మనిషి కావలెను' వంటి నాటికలు ప్రదర్శించబడతాయి.
ఆదివారం రాత్రి 8 గంటలకు బహుమతుల ప్రధానం ఉంటుంది. ఈ కార్యక్రమాలకు రాష్ట్రంలోని పలువురు హాస్య నటులు హాజరుకానున్నారు. జంధ్యాల స్మారక పురస్కారాన్ని ప్రముఖ హాస్యనటుడు, రచయిత ఏవీయస్ అందుకుంటారు. హాస్యనాటికల ప్రదర్శనపై ఒక ఎగ్జిబిషన్ కూడా నిర్వహించనున్నట్లు సుమధుర కళానికేతన్ నిర్వాహకులు మురళీకృష్ణ, ఎంసి దాస్, మోనహ్ రాయ్, సూర్యనారాయణమూర్తి భాస్కర శర్మ తదితరురులు మినర్వా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.
News Posted: 23 July, 2009
|