అలరిస్తున్న ఎలక్ట్రానిక్ వినాయకుడు
విశాఖపట్నం : కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడిని పోలినట్టుగా ఉన్న ఎలక్ట్రానిక్ వినాయకుడు అందర్నీ అలరిస్తున్నాడు. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అక్కయ్యాపాలెంకు చెందిన పెంటకోట రాజేష్ ఎలక్ట్రానిక్ వినాయకుడుని తయారు చేశాడు. భక్తులు ఈ వినాయకుడికి క్షీరాభిషేకం చేస్తే వెంటనే జయ జయ వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయకా అనే పాట వీనుల విందుగా వినిపిస్తుంది. గత సంవత్సరం నుంచి అన్నిపండుగలకు సందర్భానుసారంగా విగ్రహాలను రాజేష్ తయారు చేసి గురుద్వార్ జంక్షన్ లోని తన షాపులో సందర్శకులు చూడడానికి వీలుగా ఉంచుతున్నాడు. ఎలక్ట్రానిక్ వస్తువులను రూపొందించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడమే తన ధ్యేయమని రాజేష్ అంటున్నాడు. ఇంకా నగరంలో వినాయకచవితి వేడుకలు ఆదివారం సంప్రదాయబద్దంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు దేవాలయాలతో పాటు, ఏర్పాటుచేసిన మండపాలలోనూ చవితి ఉత్సవాలు ఉత్సాహవాతావరణంలో సాగాయి. సకల సమస్యలను తీర్చే తొలివేలుపునకు ఘన స్వాగతం పలుకుతూ ప్రతీ ఇంటా ఆధ్యాత్మికత వెళ్లివిరిసింది. వాడవాడలా చవితి పందిళ్లు వేసి సందళ్లు చేస్తూ గణపతి సేవలో నగర జనం తరించారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అంతా ఒక్కటిగా నిలిచి సమైక్యతను చాటుకున్నారు. వీధులలో ఉమ్మడిగా చవితి మండపాలను ఏర్పాటుచేయడం ద్వారా భక్తి భావాన్ని పరిమళింపచేశారు.
News Posted: 24 August, 2009
|