కనువిందుచేసిన నృత్యకేళి
విజయవాడ : నర్తకీమణి శారదా రామకృష్ణ ప్రదర్శించిన కూచిపూడి నృత్యం రసజ్ఞుల హృదయాలను అలరించింది. సాహిత్యంలోని భావాలకు అనుగుణంగా ఆమె పలికించిన అభినయ విన్యాసం నాట్యంలో ఆమెకు గల అభిరుచిని, అభినివేశాన్ని చాటి చెప్పింది. సహనర్తకిగా పీ.వీణతో కలిసి ఆమె శ్రీ గణపతిని సేవింపరారే అంటూ చేసిన నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ఆదివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యకేళిక ప్రేక్షకులకు నయన మనోహర రసానుభూతిని కలిగించింది. ఎంతోమందిని నాట్య కళాకారులుగా తీర్చి దిద్దిన శారదా రామకృష్ణ తొలిసారిగా ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆమె అపార అనుభవానికి ప్రతిరూపంగా నిలిచింది. సంప్రదాయ నాట్యరీతులలో ఒకటైన ఆంధ్ర నాట్యరంగంలో రెండు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తూ వందలాది ప్రదర్శనతో ప్రేక్షకులను ఆలరించింది. సభా కార్యక్రమంలో కళాక్షేత్రం పక్షాన ప్రముఖ నాట్య కళాకోవిదులను శారదా రామకృష్ణ ఘనంగా సన్మానించారు. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ, పసుమర్తి రత్తయ్యశర్మ, తదితరులు సత్కారాన్ని పొందారు. సత్కార గ్రహీతలు ప్రతిస్పందిస్తూ ఆంధ్ర, కూచిపూడి నాట్య రంగాలు రెండింటిలో శారదా రామకృష్ణ మరింత ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.
News Posted: 31 August, 2009
|