ముగిసిన కార్తిక మాసోత్సవాలు
శ్రీశైలం : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో గత నెల 18వ తేదిన ప్రారంభమైన కార్తిక మాసోత్సవాలు సోమవారం నాటితో ముగిశాయి. కార్తిక మాసంలో 5 సోమవారాలు రాగా, మొదటి, రెండు సోమవారాలలో వరదల ప్రభావం వల్ల అధిక సంఖ్యలో భక్తులు రాలేకపోయినప్పటికి మూడవ సోమవారం, కార్తిక పౌర్ణమి కలిసి రావడంతో మూడవ శనివారం నుండే భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి చేరుకొని శ్రీభ్రమరాంభికా సమాతే శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ మాసంలో నాగులచవితి, కార్తికపౌర్ణమి, జ్వాలాతోరణం, సంకష్టహరచతుర్థి, శనిత్రయోదశి, మాసశివరాత్రి వంటి ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహించారు.
రాష్ట్ర నలు మూలల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి చేరుకుని స్వామివార్లను దర్శించి సేవించుకున్నారు. పలువురు హైకోర్టు జడ్జిలు, మినిస్టర్లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వంటి అధికార, అనధికార ప్రముఖులు ఎందరో స్వామివార్లను దర్శించి సేవించుకున్నవారిలో ఉన్నారు. నాగులకట్ట, పాతాళగంగ వద్ద కూడా కార్తిక దీపాల పూజలను నిర్వహించి నదిలో దీపాలను వదిలారు. వివిధ ప్రాంతాల నుండి శ్రీశైలానికి వచ్చిన భక్తులు కార్తీక వనభోజనాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కార్తిక మాసంలో దేవస్థానం వారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కనుమలూరి శివయ్యచే శివసప్తాహాం, డా.శివలెంక ప్రకాష్రావుచే శివపురాణం వంటి వాటితో పాటు పలు భజన సంకీర్తనలు, భక్తిరంజని కార్యక్రమాలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
News Posted: 17 November, 2009
|