టిడిపిలో చేరిన కిషన్ సింగ్
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాల్లో జగదాంబగుళ్ళు కట్టిస్తామని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే టి.కిషన్ సింగ్, జుక్కల్ మాజీ సర్పంచ్ హేంసింగ్, మాజీ ఎంపిటిసి సభ్యులు లక్ష్మీ చౌహాన్, నందా తదితరులు చంద్రబాబునాయుడి సమక్షంలో శనివారంనాడు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో సామాన్యుడిపై ఖర్చు పెట్టే వంద రూపాయల్లో 80 మధ్యవర్తులే స్వాహా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కరవు వచ్చినా 8 రూపాయలకే కిలోబియ్యం బహిరంగ మార్కెట్లో అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ను నియంత్రించకపోవడం వల్లే కిలో బియ్యం 30 రూపాయలకు పైగా ధర పెరిగిపోయిందన్నారు. ఐదు వందల జనాభా ఉన్న తండాలను టిడిపి అధికారంలోకి రాగానే పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా టిడిపి అధ్యక్షుడు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమేష్ రాథోడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 14 March, 2009
|