5న ఓటర్ల జాబితా సప్లిమెంటు
(వేముల సదానందం)
వరంగల్ : ఓటర్ల జాబితా సప్లిమెంటు 2 ను ఈ నెల 5న అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఉచింతగా అందచేస్తామని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారు అయినందున ఆయన వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జనవరి 23 నుండి మార్చి 23 వరకు సవరించిన జాబితా ఉచితంగా అందచేయబడునని మిగతా అభ్యర్థులు డబ్బు చెల్లించి పొంద వచ్చని తెలిపారు. డూప్లికేటు ఎపిక్ కార్డులు కావాల్సిన వారు 25 రూపాయలు చెల్లించి సంబంధిత డిపిఎల్ సెంటర్లో పొందవచ్చని తెలిపారు. అభ్యర్థులందరూ వారి సంతకంతో పాటు, ఎలక్షన్ ఏజెంట్ల సంతకంతో రిటర్నింగ్ అధికారులకు తమ తమ చిరునామాలు, ఫోన్ నెంబర్లు ఇవ్వాలని, పోల్ చిట్టీలు తెలుపు రంగు కాగితంపై మాత్రమే ముద్రించాలని వాటిపై ఓటరు పేరు, ఓటరు జాబితా వరుస సంఖ్య మాత్రమే ఉండాలని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పి మాట్లాడుతూ ప్రచార నిమిత్తం వాహనాల ఆకారాన్ని మార్చరాదని, అభ్యర్థులు తమ పరిధి దాటి వెళ్ళినప్పుడు మైకులు వినియోగించరాదని పేర్కొన్నారు. మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేయు అభ్యర్థుల సౌలభ్యం కొరకు తమ ఖర్చులు చూపించుటకు జిల్లా సహకార ఆడిట్ అధికారిని ఏర్పాటు చేయడమైనది జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రచారంలో ఎలాంటి వ్యక్తగత దూషణలకు పాల్పడరాదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు, కోడ్ అమలు, నిష్పక్షపాతంగా అమలు చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగాన్ని, రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఎస్.పి.సజ్జనార్, జాయింట్ కలెక్టర్ కరుణ, డిప్యూటీ డైరెక్టర్ సాంఘీక సంక్షేమ శాఖ శ్రీధర్, ఎన్నికల పరిశీలకులు, పంచాయితీ అధికారి సురేష్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
News Posted: 4 April, 2009
|