బిజెఆర్ బదిలీ విచారకరం
(వేముల సదానందం)
వరంగల్ : ప్రభుత్వ అధికారులకు బదిలీలు కావడం సర్వసాధారణమే అయినప్పటికీ సమాజం పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన జిల్లా కలెక్టర్ డాక్టర్.బి.జనార్థన్ రెడ్డి బదిలీపై వెళ్ళడం జిల్లా ప్రజలకు విచారకరం అని ఎస్పీ వి.సి.సజ్జనార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ వరంగల్ శాఖ, పౌరసంబంధాల శాఖ సంయుక్తంగా బుధవారం వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో జనార్థన్ రెడ్డి వీడ్కోలు సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు కంకటి రాజారామ్ అధ్యక్షత వహించగా, వీడ్కోలు సన్మాన గ్రహీత డా.బి.జనార్థ్ రెడ్డి, ఎస్పీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెండోసారి రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ సర్కార్ తొలిసరిగా పదకొండు మంది ఐఎఎస్ లను బదిలీ చేసిన సంగతి విదితమే. వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఉన్న జనార్థన్ రెడ్డి అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, కలెక్టర్ తో తాను 16 నెలలు కలిసి పనిచేసిన అనుభూతిని నెమరువేసుకున్నారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసిన కలెక్టర్ జనార్థ్ రెడ్డి బదిలీని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. జర్నలిస్టు యూనియన్ నాయకులు జనార్దన్ రెడ్డి పరిపాలనా దక్షతను శ్లాఘించారు.
వీడ్కోలు సన్మాన గ్రహీత జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ గా సక్సెస్ ఫుల్ గా పనిచేయడానికి తోటి ఉద్యోగుల, ప్రజల సహకారం దోహదపడిందన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఒక తీపిగుర్తుగా గుర్తుంచుకుంటాన్నారు. గర్వం విడనాడి అధికారులు పనిచేసినంతకాలం ప్రజల మన్ననలు పొందవచ్చని బిజెఆర్ అన్నారు. మీడియా సహకారం మరువలేదని ఆయన జర్నలిస్టులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి వల్లాల వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పిండిం వేణుమాధవ్, ఐజెయు కార్యవర్గ సభ్యుడు దాసరి కృష్ణారెడ్డి, డిపిఆర్ ఓ వెంకట రమణ, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు గడ్డం కేశవమూర్తి, వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ విజయ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
News Posted: 17 June, 2009
|