సురేఖ ఆకస్మిక తనిఖీ
(వేముల సదానందం)
వరంగల్ : మహిళా, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు శిశు గృహాలను, మహిళా హాస్టళ్ళను, స్వల్పకాలిక బసకేంద్రాలను, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన కౌన్సిలర్ లలితకుమారిని, సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ ను సస్పెండ్ చేయాలని ఆమె ఆదేశించారు. అలానే హోం సూపరింటెండెంట్ పద్మావతి రెండు రోజులుగా గైర్హాజర్ కావడం, రిజిష్టర్ లో సెలవుగా నమోదు చేయకపోవడంతో చార్జి మెమో జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. బాలసదాన్ని ముందుగా తనిఖీ చేశారు. సదనంలో ఎంత మంది పిల్లలున్నారు, వారి హాజరుపట్టి, పిల్లలకు అందించే భోజనసదుపాయాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగా లేనందున వెంటనే తగు చర్యలను తీసుకోవాలని బాలాసదనం నిర్వాహకులును ఆదేశించారు. తదుపరి ఈద్గాలోని షార్ట్ స్టే హోం శాఖను, లష్కర్ బజార్ లోని ఉద్యోగినుల వసతి శిశు గృహాన్ని, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేశారు. మంత్రివెంట మహిళా, శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్ కుసమకుమారి కూడా ఉన్నారు.
News Posted: 22 June, 2009
|