'బోగస్' ఏరివేతకు బృందాలు
(వేముల సదానందం)
వరంగల్ : సంక్షేమ పథకాలను అక్రమంగా అనుభవిస్తున్న బోగస్ లబ్ధిదారుల ఏరివేతకు సర్వే బృందాలను నియమించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్. శ్రీధర్ చెప్పారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 10,41,616 కార్డులున్నాయని అందులో 1,16,449 పింక్ కార్డులు కాగా మిగతా 9,25,167 రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 3,75,000 పక్కా గృహాలు, 3,85,000 పెన్షన్లు మంజూరు అయ్యాయన్నారు.
ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో అనర్హుల ఏరివేతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానం రూపొందించిందని కలెక్టర్ చెప్పారు. ఆ విధానం ప్రకారం సర్వేల నిర్వహణకు ఐదుగురు సభ్యులతో బృందాలను నియమించి జిల్లాలోని 50 మండలాల్లో ఐదు దశల్లో ఐదు నెలల్లో బోగస్ లబ్ధిదారుల ఏరివేత పూర్తిచేస్తామన్నారు. ఒక్కొక్క దశలో పది మండలాలను ఎంపిక చేసి ప్రతి మండలంలో 20 బృందాలను రంగంలోకి దింపనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ వివరించారు. ఈ ప్రక్రియ అంతా ఆగస్టు 1 నుంచి నవంబర్ 15 నాటికి పూర్తవుతుందన్నారు.
ముందుగా జూలైలో సర్వే బృందాలకు శిక్షణ ఇస్తామని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి మండలంలో 15 రోజులకు ఒక మండలం చొప్పున తనిఖీ పూర్తి పూర్తి చేయడమే కాక అర్హులైన లబ్ధిదారుల వివరాలు కూడా సేకరిస్తారని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. బోగస్ లబ్ధిదారుల ఏరివేతతో పాటు అర్హులైన అందరికీ ప్రజా సంక్షేమ పథకాలు అందాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అన్నారు.
Pages: 1 -2- News Posted: 30 June, 2009
|