పంప్ హౌస్ సందర్శించిన కలెక్టర్
(వేముల సదానందం)
వరంగల్ : ధర్మసాగర్ ద్వారా వరంగల్ పట్టణానికి మంచినీరందించేందుకు చేస్తున్న పనుల పురోగతిని తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీధర్ ధర్మసాగర్ ను సందర్శించారు. అక్కడ ఏఏ పనులు జరుగుతున్నాయో ప్రజారోగ్య శాఖ అధికారులను, సంబంధిత కంపెనీ ప్రతినిథులను అడిగి తెలుసుకున్నారు. మూడుగేట్లకు గాను రెండు గేట్ల నిర్మాణం పూర్తయ్యాయనీ, మరో గేటును 20 రోజులలో పూర్తి చేయనున్నట్లు నిర్మాణం చేపట్టిన కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫిల్టర్ బెడ్ ల నిర్మాణంలో గానీ, రిజర్వాయర్ల నిర్మాణంలో ఏమైనా భూసేకరణకు సంబంధించిన సమస్యలుంటె చెప్పాలని కలెక్టర్ కోరడంతో ధర్మాసాగర్ నుండి వేళ్ళే నీరు వడ్డెపల్లి, కాకతీయ యూనివర్శిటీ మరియు దేశాయిపేటలలో నిర్మిస్తున్న ఫిల్టర్ బెడ్ ల ద్వారా పట్టణ ప్రజలకు నీరందించడం జరుగుతుంని ప్రజార్యో శాఖ అధికారులు వివరించారు. పట్టణంను 37 జోన్లుగా విభజించి రిజర్వాయర్లను నిర్మించడం జరుగుతుందని, పాత రిజర్వాయర్లు 22 ఉండగా, 15 కొత్తగా నిర్మించడం జరుగుతుందని వీటిలో 11 రిజర్వాయర్లలో పనులు పురోగతిలో ఉన్నాయని వారు కలెక్టర్ కు వివరించారు.
తదుపరి కలెక్టర్ దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ధర్మసాగర్ వద్ద నిర్మించిన పంప్ హౌస్ ను సందర్శించారు. అలానే వడ్డెపల్లి వద్ద నిర్మిస్తున్న ఫిల్టర్ బెడ్ ను సందర్శించిన కలెక్టర్ నిర్మాణపు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఏమైన సమస్యలు ఉంటే ప్రతినిధులు తెలపాలన్నారు. కాకతీయ యూనివర్శిటీ వద్ద నిర్మిస్తున్న ఫిల్టర్ బెడ్ ను పరిశీలించిన కలెక్టర్ అక్కడ పనులు చురుగ్గా జరుగుతుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. దేశాయి పేటలో నిర్మిస్తున్న ఫిల్టర్ బెడ్ ను సందర్శించి పనుల ప్రగతిని పరిశీలించారు. డిసెంబర్ నాటికి అన్ని పూర్తి చేసుకునే విధంగా తగు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మంచిదని కంపెనీ ప్రతినిధులతో ఆయన అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట వరంగల్ మున్సిపల్ కమీషనర్ శివకోటి ప్రసాద్, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ప్రజారోగ్య శాఖ సూపరిటెండెంట్ ఇంజనీర్ రామయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామస్వామి దేవాదుల సూపరింటెండెంట్ ఇంజనీర్ మహదేవ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గణపతిరావు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 2 July, 2009
|