హుందాగా మెలగండి : గండ్ర
(వేముల సదానందం)
వరంగల్ : ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపుతూ చౌకబారు ఆరోపణలకు ఒడిగట్టి గడచిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఓటమిని ఓ గుణపాఠంగా తీసుకోకుండా తిరిగి అదే ధోరణి అవలంభించడం విచారకరమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గండ్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన వరుణయాగాలను సైతం విమర్శించే స్థాయికి ప్రతిపక్షాలు దిగజారాయాని ఆరోపించారు. ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాలు కురియడం కొంత ఆలస్యమైప్పటికీ ఈనెల 6 నుండి విరివిగా మర్షాలు కురుస్తాయని అన్నారు. వర్షాలు కురియడానికి ప్రస్తుతం వరుణ యాగాలు చేపట్టినప్పటికీ తర్వాత వర్షాలు ఇక చాలు అంటూ తిరిగి యాగాలు చేయాల్సి వస్తుందని గండ్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పరిరక్షించడానికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన రాజ్యసభ సభ్యుడు కెవిపి రాంచంద్రారావుతో కమిటీ వేస్తే ప్రతిపక్షాలు స్వాగతించాల్సింది పోయి కెవిపిని రాజ్యాంగేతర శక్తిగా విమర్శించడం తగదన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల తప్పని పరిస్థితుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చిందని గండ్ర అన్నారు. త్వరలోనే అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు తగ్గుతాయని దానికి అనుగుణంగా పెట్రో ధరలను తగ్గిస్తామని ప్రధాన మంత్రి మన్ మోహన్ సింగ్ ప్రకటించారని, ఈ విషయాన్ని ప్రజలు, ప్రతిపక్షాలు సానుకూలంగా అర్థం చేసుకోవాలని గండ్ర కోరారు. రాష్ట్రంలో సహకార సేద్యం వల్ల సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని గండ్ర తెలిపారు. ప్రజలకు మేలు కలిగే ప్రభుత్వ నిర్ణయాలను సైతం ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరైంది కాదని, నిర్మాణాత్మకమైన ఆరోపణలు చేస్తూ హుందాగా మెలగాల్సిన అవసరం ప్రతిపక్షాలపై ఉందన్నారు. ఈ సమావేశంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, వరంగల్ మార్కెట్ డైరెక్టర్ వనం సురేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
News Posted: 3 July, 2009
|