ఉచిత న్యాయ సలహాలు : జడ్జి
(వేముల సదానందం)
వరంగల్ : ఉపాధి హామీ పథకంతో పాటు ప్రభుత్వ పథకాల అమలులో సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ఉచిత న్యాయం అందించడానికి జిల్లా న్యాయసేవాధికర సంస్థ ముందుంటుందని జిల్లా న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు కె అశోక్ బాబు అన్నారు. మైనం పల్లిలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలమేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని సామాజిక తీరు తెన్నులు, వాటిపై ప్రజల స్పందనలు, సమస్యలు తెలుసుకోవడం జరుగతుందన్నారు. కేవలం ఉపాధి హామీ పథకం సమస్యలే కాకుండా గృహనిర్మాణం, ఫించన్లు, రేషన్ కార్డులు లాంటి పథకాలలో ప్రజలెవరికైనా సమస్యలుంటే దగ్గరలోని న్యాయ సేవాధికార సంస్థ వారికి దరఖాస్తు చేసుకోవచ్చని, వీటి పరిష్కారానికి కూడా కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక తనిఖీ విభాగం సంచాలకులు డి రాజశేఖర్ మాట్లాడుతూ ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన 22 జిల్లాలో సామాజిక తనిఖీ జరుగుతోందన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలలో కూడా ఇదే విధంగా తనిఖీలూ ఉండాలంటే జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని గ్రామస్తులను కోరారు. గ్రామ సభల్లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీల సగం మందికి స్మార్ట్ కార్డూ జారీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. మైనం పల్లి గ్రామ పంచాయితి సర్పంచ్ కురమారస్వామి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కరీనంగర్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి స్వాతి, వరంగల్ కార్యదర్శి రజాక్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హరిజవహర్, ఎపిడిడి జగన్, న్యాయ అధికారులు జగదీష్ చంధ్ర, ఆర్.రాధాదేవి, పి.రాజేశ్వరి, పి.జ్యోతి, ఎ.కిరణ్ కుమార్, కె.హనుమంతరావు, కె.అరుణకుమారి, పి.వసంత, జి.ప్రేమలత, జి.భవానిచంధ్ర తదితరులు పాల్గొన్నారు.
News Posted: 6 July, 2009
|