గణేష్ పల్లికి గండ్ర వరం
(వేముల సదానందం)
వరంగల్ : ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తన దృష్టికి రావడంతో వాటిని పరిష్కరించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి హామీ ఇచ్చారు. గణేష్ పల్లిలో రక్షిత మంచినీటి పథకానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ పల్లె గ్రామానికి రహదారి సక్రమంగా లేనందున ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ అందువల్ల వెంటనే తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పల పల్లి, పోతుగల్లు, కోర్కిశాల, గణేష్ పల్లి మీదుగా పర్లపల్లి నుండి బస్సు నడిచే విధంగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడతానని గండ్ర హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు ఎక్కువగా తాగునీటి మూలంగానే ప్రబలుతున్నాయని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సిఎం ఈ నిర్ణయం తీసుకోగానే గణేష్ పల్లి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని గండ్ర హామీ ఇచ్చారు.
జిల్లా పరిషత్ టిఆర్ ఎస్ ప్లోర్ లీడర్ నాగుర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గణేష్ పల్లె గ్రామానికి సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో రక్షిత మంచినీటి పథకం మంజారు కావడానికి తాను కృషి చేశానన్నారు. ఎన్నికల ముందే ఈ పధకానికి నిధులు మంజూరైనప్పటికీ ఎన్నికల కోడ్ అమలలో ఉన్నందున ఆలస్యంగా శంఖుస్థాన చేయాల్సి వచ్చిందన్నారు. గండ్ర వెంకట రమణారెడ్డి సహకారంతో మొగుళ్ళపల్లి మండలాన్ని అభివృద్ధి పర్చడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు ప్రేమలత మాట్లాడుతూ గ్రామంలో సైడ్ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు ఆడిచర్ల రవీందర్, గ్రామీణ మంచినీటి విభాగం డి.ఇ పోచయ్య, ఎండిఓ రమణాచారి, గృహనిర్మాణ సంస్థ డిఇ శ్యామల నాయక్, చిట్యాల సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీందర్, ఎస్సై అమృతరెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ ఇ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భూపాల పల్లి శాసనసభ్యులుగా గెలుపొందిన గండ్ర వెకటరణారెడ్డి తొలిసారిగా గణేష్ పల్లికి విచ్చేయడంతో గ్రామ ప్రజలు ఆయన పూలమాలలు, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
News Posted: 10 July, 2009
|