మంచినీటి పధకానికి శ్రీకారం
(వేముల సదానందం)
వరంగల్ : గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని భూపాలపల్లి శాసనసభ్యులు, డిసిసి అధ్యక్షుడు గండ్రవెంకట రమణారెడ్డి హామీ ఇచ్చారు. మొగుళ్ళపల్లి మండలం రంగాపురం, గణేష్ పల్లి గ్రామాలలో మంజూరైన రక్షిత మంచినీటి పథకాలకు ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి ఎద్దడి నివారణకు, పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి మినరల్ వాటర ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రంగాపురంలో లక్షా 20 వేల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మాణానికి27 లక్షలు, గణేష్ పల్లిలో 20 వేల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మాణానికి 7 లక్షల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. భూపాలపల్లి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత రంగాపురం, గణేష్ పల్లి గ్రామాలను గండ్ర సందర్శిండాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించుకున్నారు. గ్రామాలలో డప్పు చప్పుళ్ళు, బాణా సంచాలు కాల్చి విజయోత్సవ ర్యాలీని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శులు వెంకటరెడ్డి, కాడగాలి ఆగయ్య, పిఎసిఎస్ చైర్మన్ లింగారావు, మొగుళ్ళపల్లి మండల పరిషత్ అధ్యక్షులు ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
News Posted: 10 July, 2009
|