గ్రామీణ విలేఖరులకు శిక్షణ
(వేముల సదానందం)
వరంగల్ : జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఏ విధమైన శిక్షణ అవసరం ఉన్నా అందించడానికి ప్రెస్ అకాడమీ సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవులపల్లి అమర్ అన్నారు. పాలకుర్తి నియోజక వర్గం పరిధిలోని తొర్రూర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ యూనియ్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వరంగల్ జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ విలేఖరుల శిక్షణా తరగతులు శుక్రవారం ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ శిక్షణా తరగతులను అమర్ జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షులు కంకటి రాజారామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దేవుల పల్లి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి సమృద్ధిగా నిధులు లేకపోయినప్పటికీ విలేఖరులకు శిక్షణా తరగతలు నిర్వహించడానికి వెనకంజ వేసే ప్రసక్తే లేదన్నారు.
జర్నలిస్టు వృత్తిలో వేగం, పోటీ విపరీతంగా పెరిగి పోయిందని దీనికి అనుగుణంగా విలేఖరుల సామర్ధ్యం కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పత్రికలు, చానళ్ళు పెరిగిపోతుండటంతో 40 నుండి 50 శాతం మంది కొత్తవారు ఈ వృత్తిలోకి వస్తున్నారని, వీరికి వృత్తి పట్ల కనీస అవగాహన కూడా కల్పించలేదని పరిస్థితుల్లో సంస్థలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ విలేఖరుల పునశ్చరణ తరగతుల ద్వారా సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే భాష, శైలి, చట్టం గురించి, దైనందిన కార్యక్రమాలలో ప్రెస్ అకాడమీ కోర్సు మెటీరియల్స్ ను అందజేస్తున్నట్లు అమర్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్స్ శిక్షణా తరగతులను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు దేవులపల్లి తెలిపారు.
Pages: 1 -2- News Posted: 11 July, 2009
|