వన మహోత్సవం
అనంతపురం : ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఎక్స్ టెన్షన్ బిల్డింగ్ ఆవరణలో అటవీశాఖ డీఎఫ్ ఓ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో 60వ వన మహోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మెడికల్ కళాశాల ఆవరణలో 400 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 49 కేంద్రీయ నర్సరీల్లో 30 లక్షల మొక్కల్ని పెంచామని, వాటిలో 10 లక్షల మొక్కల్ని విద్యార్థులచేత నాటిస్తామన్నారు. జడ్పీ చైర్ పర్సన్ తోపుదుర్తి కవిత మాట్లాడుతూ కరువుకు నిలయమైన మన జిల్లాలో మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు రెండేసి మొక్కలను విధిగా నాటి వాటి సంరక్షణ చేపట్టాలన్నారు. అటవీ శాఖవారు నిర్వహించిన వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు జెడ్పీ చైర్ పర్సన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ ఫారెస్ట్ అధికారి ప్రసన్నకుమార్, చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ అధికారి ఎస్ ఎన్ జాదవ్, మెడికల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు ధర్మరాజు, పెక్షావలి ఆనంద్, కాలేజ్ ప్రినిస్పాల్ ప్రభాకరరావు పాల్గొన్నారు.
News Posted: 13 July, 2009
|