కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. పసుపు, చందనం, కుంకుమ, తిరునామం, పచ్చకర్పూరం తదితర మిశ్రమాలతో తయారు చేసిన లేపనంతో అర్చకులు ఆలయాన్ని శుభ్రం చేస్తారు. గర్భాలయ సన్నిధిలోని గోడలతోపాటు, ఆలయంలోని ఉత్సవ విగ్రహాలైన వకులమాళిక, భాష్యకారులు, యోగనరసింహస్వామి, వరదరాజస్వామి, తదితర దేవతా మందిరాలను కూడా శుభ్రపరిచారు. ప్రసాదాలు తయారు చేసే పోటులను కూడా శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు ఆలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నాలుగుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉగాది, అణవార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందుగా వచ్చే మంగళవారాలలో ఈ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ ప్రక్షాళన నేపథ్యంలో శ్రీవారి కల్యాణం మినహా మిగిలిన సేవలన్నింటినీ రద్దు చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తర్వాత స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.
News Posted: 14 July, 2009
|