నగరంలో రెండు రోజులు చిరు
తిరుపతి : స్థానిక ఎమ్మెల్యే, ప్రజారాజ్యం పార్టీ అధినేత కొణిదెల చిరంజీవి శని, ఆదివారాల్లో నియోకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత చిరంజీవి నియోజకవర్గంలో రెండోసారి పర్యటన కోసం నగరానికి ఉదయం చేరుకున్నారు. ఈ రెండు రోజుల్లోనూ ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పర్యటన షెడ్యూల్ రూపొందించారు.
శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ఆయన ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన బీసీ హాస్టల్ కమిటీతో సలహాదారుగా సమావేశమయ్యారు. అనంతరం రోడ్డు విస్తరణ పనుల విషయమై చిన్నబజారు, టి.కె.స్ట్రీట్ అసోసియేషన్ నాయకులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 11 నుంచి ఒంటిగంట వరకూ ఇక్కడి మున్సిపల్ లలితకళా ప్రాంగణంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ఇళ్ళ పట్టాల సమస్యపై పూలతోట ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తారు. నాలుగు గంటలకు తాటితోపులోని చిన్నపిల్లల అబ్జర్వేషన్ హోంను పరిశీలిస్తారు. ఆరు గంటలకు సాయి నిర్మల రామయ్య కల్యాణ మండపంలో నిర్వహించే ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రేణిగుంట చేరుకున్న అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో పనిచేస్తామన్నారు.
ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు నెహ్రూ నగర్ లో పవర్ పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు. పదకొండున్నరకు తిరుపతిలోని రుయా ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తారు.
News Posted: 18 July, 2009
|