'నిజాయితీకే ప్రజల మన్నన'
(వేముల సదానందం)
వరంగల్ : నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిన అధికారులు ప్రజల మన్నన పొందడం ఖాయమని 'ఆక్టోపస్' ఎస్పీ వి.సి. సజ్జన్నార్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీగా పనిచేసిన సజ్జన్నార్ ను రాష్ట్రప్రభుత్వం ఇటీవలే ఆక్టోపస్ విభాగానికి బదిలీ చేసింది. బదిలీపై వెళుతున్న సజ్జన్నార్ కు ఎపియుడబ్ల్యుజె వరంగల్ జిల్లా శాఖ మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన సజ్జన్నార్ వీడ్కోలు సమావేశానికి ఎపియుడబ్ల్యుజె వరంగల్ శాఖ అధ్యక్షుడు కరకట రాజారామ్ అధ్యక్షత వహించారు.
సమావేశంలో సజ్జన్నార్ మాట్లాడుతూ, సమాజంలోని చెడును అరికట్టడానికి తన వంతు కర్తవ్యంగా పనిచేసినట్లు చెప్పారు. మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మోసగాళ్ళు పుట్టుకొస్తుంటారని, వారి బారిన పడకుండా అమాయకులను అప్రమత్తం చేయడానికి మీడియా సానుకూల వైఖరితో వ్యవహరించాలని సజ్జన్నార్ కోరారు. సమాజానికి మేలు చేసేందుకు అధికారులతో పాటు పాత్రికేయులు కూడా సహకరించాలని ఆయన సూచించారు. జిల్లా ఎస్పీగా తాను 16 నెలలు విజయవంతంగా పనిచేశానని, అందుకు సహకరించిన అధికారులు, సిబ్బంది, సహకరించిన మీడియాకు సజ్జన్నార్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ లో పనిచేసిన అనుభూతి, అనుభవాలనూ తాను ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు.
ప్రజల సమస్యలే పోలీసు శాఖ సమస్యగా భావించి సేవలందించిన సజ్జన్నార్ జిల్లా ప్రజల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నారని ఎపియుడబ్ల్యుజె వరంగల్ శాఖ అధ్యక్షుడు కరకట రాజారామ్ కొనియాడారు. ఐజెయు కార్యవర్గ సభ్యుడు, ప్రెస్ అకాడమీ పాలక మండలి సభ్యుడు దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, యాసిడ్ దాడి నిందితుల విషయంలో సజ్జన్నార్ తీసుకున్న నిర్ణయం జిల్లా ప్రజల మదిని దోచుకున్నదన్నారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అంకితభావంతో పనిచేసిన విసి సజ్జన్నార్ ను జిల్లా ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎపియుడబ్ల్యుజె జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వల్లాల వెంకటరమణ కొనియాడారు.
ఈ సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు గడ్డం కేశవమూర్తి, జిల్లా పౌర సంబంధాల అధికారి కె. వెంకటరమణ, గృహ నిర్మాణ సంస్థ అధికారి విజయగోపాల్, వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు పి.వి. మదన్ మోహన్, పి.శివకుమార్, జిల్లా మాజీ అధ్యక్షుడు బి.ఆర్. లెనిన్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు దొంతు రమేష్, సీనియర్ జర్నలిస్టులు అనిల్, బండి రవీందర్, శ్రీనివాస్, వెంకట్, వెంకన్న, వీణావాణి, గోలి విఠల్, శంకేశి శంకర్రావు, పెండెం వేణుమాధవ్, జితేందర్, శ్యాం తదితరులు సజ్జన్నార్ తో తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సజ్జన్నార్ ను శాలువలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
News Posted: 28 July, 2009
|