వానల కోసం జలాభిషేకాలు
నిజామాబాద్ : వర్షాలు కురవాలని, పంటలు సరిగా పండాలని కోరుతూ మండలంలోని సోమార్పేట గ్రామ ప్రజలు ఆలయంలోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. యువకులు ప్రతి ఇంటికీ తిరుగుతూ కప్పకావడి నిర్వహించారు. వరుణ దేవతకి పూజలు చేస్తే వర్షాలు కూరుస్తాయనే నమ్మకంతో పిల్లా పెద్దా అందరూ చెరువులోంచి బిందెలతో నీటిని తీసుకువచ్చి గ్రామంలోని పలు ఆలయాల్లో గల దుర్గమ్మ, ముత్యాల పోచమ్మ, హనుమాన్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. రోకలికి కప్పను కట్టి వేప ఆకులు చుట్టారు. కప్ప కప్ప కావడి - వానకొట్టు దేవుడీ అంటూ నినాదాలుచేస్తూ ఇల్లిల్లూ తిరిగారు. కప్ప కావడికి పూజలు చేస్తే వర్షాలు పుష్కలంగా కురుస్తాయని నమ్మకంతో పిల్లా పెద్దలు, రైతులు అంతా కలిసి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు బతుకమ్మ ఆటలు ఆడుతూ వర్షాలు కురవాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 3 August, 2009
|