రాఘవేంద్రుని ఆరాధనోత్సవాలు
కర్నూలు : వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... మంగళవాయిద్యాల మధ్య, భక్తుల హర్షద్వానాల మధ్య పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 338వ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుయతీంద్ర తీర్థస్వామిజీ జెండాను ఆవిష్కరించి ధ్వజారోహణ చేశారు. ముందుగా గ్రామ దేవత అయిన మంచాలమ్మకు పీఠాధిపతి శ్రీ సుయతీంద్రతీర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మఠం ప్రాంగణం ముందు, గోపూజ, లక్ష్మిపూజ, గజ పూజలను పీఠాధిపతులు నిర్వహించారు. మఠంలోపలి ప్రాంగణంలో పీఠాధిపతి అన్ని రకాల ఆకుకూరగాయలకు పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులను ఆలయ ప్రాంగణం చుట్టూ వైభవంగా ఊరేగించారు.
ఆరాధనోత్సవాల సందర్భంగా శ్రీమఠాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో మఠం ప్రాంగణం దేదివ్యమానంతో వెలిపోతోంది. బుధవారం రాత్రి మఠం కళా ప్రాంగణంలో నిర్వహించిన దాసవామి సంగీత కచేరి భక్తులను ఆకట్టుకుంది. చెన్నైకి చెందిన భాగవత కృష్ణ నిర్మించిన కీ బోర్డు ప్రదర్శన అహుతలను అలరించింది. అలానే అనంతపురానికి చెందిన శ్రావ కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. మఠం పీఠాధిపతి తనయుడు సుయమీంద్రాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ రామకృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి, పిఎం ఆనందరావు, విఆర్వో ఐపి నర్సింహా, సంస్కృత విద్యా పీఠం ప్రిన్సిపాల్ వాది రాజాచార్, మఠం సెక్యూరిటి ఆఫీసర్ సూర్యచంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News Posted: 6 August, 2009
|