కన్నుల పండుగగా శ్రీవారి కళ్యాణం
తిరుపతి : శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న మైదానంలో వివిధ రకాల పూష్పాలతో, పచ్చని తోరణాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికలో శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అలాంకార శోభితులైన ఉత్సవమూర్తులను తిరుమ నుంచి తిరుపతిలోని కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు. వైఖానస ఆగమ శాస్ర రీతిలో కళ్యాణ గడియ రాగానే పురోహితుల వేద మంత్రాల నడుమ శ్రీనివాసుడు, పద్మావతీ అమ్మవార్లకు కళ్యాణ కంకణ రేఖలను అలంకరించారు. సుంగంధ పరిమళాలు వెదజల్లే పూలతో కూడిన పుష్పహారాలను ఉత్సవమూర్తులకు అలంకరించారు. మంగళ సూత్ర దారణను ప్రధాన అర్చకులు స్వామివారికి చూపించి అమ్మవారి మెడలో ధరింపచేశారు. పద్మావతీ, శ్రీనివాసుల కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు పులకించిపోయారు. శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులకు అమ్మవారి కుంకుమ, కంకణ దారాలు, శ్రావణ పూర్ణిమ పుస్తకం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ జేఈవో యువరాజు, డీపీపీ కార్యదర్శి విజయరాఘవాచారి హాజరయ్యారు.
News Posted: 6 August, 2009
|