కాణిపాకంలో చవితి వేడుకలు
తిరుపతి : వినాయక చవితి సందర్భంగా కాణిపాక వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం మూల విరాట్ కు అభిషేకం నిర్వహించారు అనంతరంస్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. అణివేటి మండపంలో ఉత్సవమూర్తులను అలంకరించి గణపతి వ్రతం జరిపారు. ఎటు చూసినా భక్తుల కోలాహలం కనిపించింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్ని వినియోగదారులతో కిటకిటలాడాయి. అలాగే పట్టణంలో మిట్టూరు, కొంగారెడ్డిపల్లి, గిరింపేట, మార్కెట్ చౌక్, రామ్నగర్ కాలనీ, టాప్ లైన్, దొడ్డిపల్లి తదితర ప్రాంతాలలో భారీఎత్తున భక్తులు యువకుల సహాయంతో వినాయకుడి ప్రతి రూపాలను ప్రతిష్ఠించి పూజలను నిర్వహించారు. ఆయనకు ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఆరాధించారు. పట్టణంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా వినాయక స్వామి కథలను చదివి నీలాపనిందలు రాకుండా స్వామి వారి ముందుంచిన అక్షింతలను తమ శిరస్సులపై చల్లుకుని పూజలను చేశారు.
News Posted: 24 August, 2009
|