అంతర్జిల్లా దోపిడీ దొంగ అరెస్ట్
(వేముల సదానందం)
వరంగల్ : మోస్ట్ వాంటెడ్ దొంగ బొమ్మకంటి శ్రావణ్ కుమార్ (28)ని పోలీసులు ఎట్టకేలకు సోమవారం పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన శ్రావణ్ కుమార్ హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్నాడు. చివరికి వరంగల్ సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసుల చేతికి చిక్కాడు. శ్రావణ్ కుమార్ వివరాలను జిల్లా ఎస్పీ మహ్మద్ షా నవాజ్ ఖాసీం సోమవారం సాయంత్రం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని రాణి రుద్రమదేవి మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వెళుతున్న శ్రావణ్ నుసిసిఎస్ పోలీసులు హంటర్ రోడ్ లో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 7.50 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 8న హన్మకొండలోని వికాస్ నగర్ లో ఒక ఇంటిలో 18 గ్రాముల బంగారు ఆభరణాలను, మార్చి 26న వరంగల్ లోని శివనగర్ లో మరో ఇంటి నుంచి 154 గ్రాముల ఆభరణాలను, ఏప్రిల్ 18న శాయంపేట - హంటర్ రోడ్ లోని శ్రీ సిద్ధి భైరవ ఆలయంలో 17 గ్రాముల ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను శ్రావణ్ దొంగిలించినట్లు ఎస్పీ ఖాసీం వివరించారు.
ఇంకా పలు చోట్ల దోపిడీలకు పాల్పడిన శ్రావణ్ కుమార్ ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్ ల చోరీలో కూడా సిద్ధహస్తుడే అని ఎస్పీ చెప్పారు. గతంలో కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో చోరీలు చేసి పలుమార్లు పోలీసులకి చిక్కిన శ్రావణ్ కుమార్ జైలుకు వెళ్ళినట్లు ఆయన తెలిపారు. జూలై 19న వరంగల్ కాశీబుగ్గలోని ఎస్ ఆర్ తోటలో సిసిఎస్ పోలీసులకు చిక్కి వారం రోజుల తరువాత వారి కళ్ళు గప్పి పారిపోయాడు. అప్పటి నుంచీ శ్రావణ్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో వరంగల్ టౌన్ డిఎస్పీ ఆర్. వెంకటేశ్వరరావు, సిసిఎస్ సిఐ శోభనాచలం పాల్గొన్నారు.
News Posted: 1 September, 2009
|