బ్యాంకు ఉద్యోగి అరెస్టు
(వేముల సదానందం)
వరంగల్ : ఉద్యోగం చేస్తున్న బ్యాంకులోనే నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి 20 లక్షల రూపాయలు రుణంగా తీసుకున్న టి. బాబాప్రసాద్ ను, అతనికి సహకరించిన గోల్డ్ స్మిత్ వేణుగోపాల్ ను సుబేదారి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సుబేదారి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్, ఎస్సై సతీష్ బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నక్కలగుట్ట ఆంధ్రాబ్యాంకు శాఖలో లాకర్ ఇన్ చార్జి బాబా ప్రసాద్ 2008 మార్చి నుంచి 2009 మార్చి వరకూ బినామీ పేర్లపై మొత్త 63 రుణాలు మంజూరు చేశారు. 19,99,081 రూపాయలను బంగారు ఆభరణాలపై రుణాల రూపంలో బ్యాంకు నుంచి తీసుకున్నారు. అయితే, 63 రుణాల చెల్లింపుల స్థానంలో బ్యాంకు లాకర్లలో బంగారానికి బదులు నకిలీ బంగారం పెట్టి ఘరానాగా మోసం చేశారు. లాకర్ ఇన్ చార్జి, గోల్డ్ స్మిత్ కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడడంతో విషయం బయటకు పొక్కలేదు. అయితే, బ్యాంకులోని గోల్డ్ లోన్ తీసుకున్న ఖాతాదారులు తిరిగి విడిపించుకోకపోవడంతో బ్యాంకు ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది.
ఇలా ఉండగా, నక్కలగుట్ట బ్రాంచిలో పనిచేస్తున్న బాబా ప్రసాద్ ఇటీవల కెఎంసి బ్రాంచికి బదిలీ అయ్యాడు. దీనితో హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి 27న వచ్చిన అధికారులు నక్కలగుట్ట బ్రాంచిలో తనిఖీలు నిర్వహించారు. లాకర్లలో ఉన్న బంగారు ఆభరణాలను అప్రైజర్ తో తనిఖీ చేయించారు. దీనితో అవి నకిలీవని తేలింది. నకిలీ ఆభరణాలను పెట్టిన సమయంలో లాకర్ ఇన్ చార్జిగా ఉన్న బాబాప్రసాద్ ను అనుమానించారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో సుబేదారి పోలీసులు బాబాప్రసాద్ ను, గోల్డ్ స్మిత్ వేణుగోపాల్ ను అరెస్టు చేశారు.
News Posted: 1 September, 2009
|