ఫాదర్ కొలంబో కన్నుమూత
(వేముల సదానందం)
వరంగల్ : సమాజసేకు జీవితాన్ని అంకితం చేసిన ఫాదర్ అగస్టియన్ కొలంబో (82) సోమవారం తుదిశ్వాస విడిచారు. త్రివేండ్రంలోని కోవడలో రోమన్ క్యాథలిక్ లను ఆశీర్వదించేందుకు మూడు రోజుల క్రితం వెళ్ళిన కొలంబో గుండెపోటుతో మరణించారు. ఫాదర్ కొలంబో మరణ వార్త తెలియగానే క్యాథలిక్ చర్చిలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ధర్మసాగర్ మండలం కరుణాపురంలో ప్రజలు కలియుగ ఏసుగా భావించే ఫాదర్ కొలంబో ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇటలీకి చెందిన ఫాదర్ అగస్టియన్ కొలంబో 1927 మార్చి 15న ఫార్చునేట్ - మరియ దంపతులకు జన్మించారు. 1952లో భారతదేశం వచ్చి ఖమ్మం జిల్లాలో సమాజ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. 1971లో స్టేషన్ ఘన్ పూర్ వచ్చి సేవలు చేపట్టారు. 1983లో ధర్మసాగర్ మండలంలోని పెద్ద పెండ్యాల శివారులో 200 ఎకరాల విస్తీర్ణంలో కరుణాపురం సేవాశ్రమం స్థాపించారు. విశ్వకర్మ సంఘం స్థాపించి వికలాంగులు, వితంతువులకు వృత్తి శిక్షణ ఇప్పించారు. లోడి సంస్థ ద్వారా ఎయిడ్స్ నివారణ, అవగాహన కార్యక్రమాలతో పాటు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, కుష్ఠురోగుల కోసం 300 ఇళ్ళు నిర్మించారు. రెండు దశాబ్దాల క్రితమే పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు విద్యా నికేతన్, జెఎంజె కళాశాల, క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలను నెలకొల్పారు.
ఫాదర్ కొలంబో మృతి పట్ల భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ ఎన్. శ్రీధర్ ప్రగాఢ సంతాపాన్ని వెలుబుచ్చారు.
News Posted: 1 September, 2009
|